సింగరేణిలో సమస్యల పరిష్కారానికి సీఎండీ అంగీకారం : సీతారామయ్య

సింగరేణిలో సమస్యల పరిష్కారానికి సీఎండీ అంగీకారం : సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు :  సింగరేణి పర్మినెంట్, కాంట్రాక్ట్​  కార్మికుల సమస్యల పరిష్కారానికి సంస్థ సీఎండీ బలరాం నాయక్​ అంగీకరించారని  ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్ది సీతారామయ్య తెలిపారు. శనివారం మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. సింగరేణిలో సొంతింటి పథకం అమలు, ఇన్​కమ్​ట్యాక్స్​ సమస్యను పరిష్కరించాలని సీఎండీని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

రిటైర్డ్  కార్మికులకు 11వ వేజ్​బోర్డు ఎరియర్స్, లాభాల్లో వాటా, దీపావళి బోనస్​ను త్వరలో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని, జీతాలు పెంచాలని 18 రోజులు సమ్మె చేశారని చెప్పారు. సర్కారు జీఓ​22 రిలీజ్​ చేసినా గెజిట్​ పబ్లిష్​ చేయకపోవడంతో వేతనాలు పెరగడం లేదన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా సింగరేణి ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్​ ఇవ్వాలని కోరితే ఈఎస్ఐ ద్వారా డబ్బులు కడుతామని యాజమాన్యం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో​ఏఐటీయూసీ సెంట్రల్​ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, మందమర్రి ఏరియా సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.