
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో సంచలనంగా మారిన సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 8.71 లక్షలు అక్రమంగా డ్రా చేసినట్టు గతంలో కేసు నమోదైంది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖమ్మం జిల్లాకు చెందిన పగడాల శ్రీనివాసరావు, యాస వెంకటేశ్వర్లును ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం విచారించగా వీరు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిని రిమాండ్ కు తరలించారు. అలాగే ఈ నేరంతో సంబంధం ఉన్న వారిని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.