రేవల్లి,వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆయా మండలాల్లో పర్యటించి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనాలను పరిశీలించారు.
భవనాల నిర్మాణ నాణ్యతను సమీక్షించిన కలెక్టర్, పెండింగ్లో ఉన్న ఫర్నిచర్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాలను వెంటనే నూతన భవనాల్లోకి మార్చి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్లకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు మల్లికార్జున్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
