భద్రాద్రికొత్తగూడెం/ టేకులపల్లి, వెలుగు : జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 పరిశ్రమలకు దరఖాస్తులు రాగా, 39 సాక్షన్ చేసినట్టు తెలిపారు. పరిశ్రమల పరంగా జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు.
అనంతరం కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో హై డెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్లో ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎఫ్వో కిష్టాగౌడ్, సింగరేణి డైరెక్టర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం టేకులపల్లి తహసీల్దార్ఆఫీస్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
