ప్రచార సామగ్రి ముద్రణకు పర్మిషన్​ తప్పనిసరి: మధుసూదన్ నాయక్

 ప్రచార సామగ్రి ముద్రణకు పర్మిషన్​ తప్పనిసరి: మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్,వెలుగు: ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్,  కేబుల్ నిర్వాహకులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లో  ప్రింటింగ్ ప్రెస్, సిటీ కేబుల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి  పార్టీల ప్రచార సామగ్రి ముద్రించాలన్నారు.  అనుమతి పొందిన వాటిని మాత్రమే ముద్రించాలని సూచించారు.  ప్రచార సామగ్రిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్,  ప్రతుల సంఖ్య,  అభ్యర్థి పేరు, చిరునామా   తప్పనిసరిగా ముద్రించాలని తెలిపారు. కేబుల్ టెలివిజన్ లో  ప్రసారాలకు సంబంధించి ముందస్తు అనుమతులు పొందాలన్నారు.  

ధాన్యాన్ని సేకరించాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్య సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్  మధుసూదన్ నాయక్ సూచించారు. శనివారం  కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై డీఆర్డీవో, సహకారశాఖ, వ్యవసాయ, రైస్ మిల్లర్స్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్య సేకరణ కు జిల్లా వ్యాప్తంగా 230 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో   మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ రోజు కారోజు ఆన్లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు.  ఆయా సమవేశాల్లో నగర  కమిషనర్, ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి, తదితరులు పాల్గొన్నారు.