కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదును పెంచాలని, స్టూడెంట్ల అటెండెన్స్ 85 శాతం తగ్గకుండా చూడాలని కలెక్టర్ పమేలాసత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, ఎంఈవోలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరిత విద్యాలయ రిజిస్ట్రేషన్లలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు.
పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థుల హాజరు శాతాన్ని తెలియజేసి, పిల్లలు ప్రతిరోజూ స్కూళ్లకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్లో కల్పించిన అన్ని సౌకర్యాలు వినియోగంలో ఉండాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు తరచుగా స్కూళ్లను సందర్శించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో చైతన్యజైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జీజీహెచ్ను సందర్శించిన కలెక్టర్
కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ హాస్పిటల్లోని క్రిటికల్ కేర్, ఓపీ విభాగం, స్కానింగ్ రూం, ఆపరేషన్ థియేటర్, ఎంసీహెచ్ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ... క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ను సమకూర్చుకోవాలని, అవసరమున్న ఇతర సౌకర్యాలు, మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా పాల్గొన్నారు.
