
పుల్కల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండలంలోని సుల్తాన్ పూర్ హై స్కూల్, తాడ్దాన్ పల్లి ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం తాడ్దాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్దిదారులకు ఇసుక కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇండ్ల నిర్మాణ పనుల స్థాయిని బట్టి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజ్ లో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆలోచన విధానంతో చదువుకుంటేనే ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారన్నారు.
చేప పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాలి
సంగారెడ్డి టౌన్: జిల్లాలో చేప పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అడిషనల్కలెక్టర్చంద్ర శేఖర్, మత్స్యశాఖ అధికారి మధుసూదన్, నీటి పారుదలశాఖ అధికారి జనార్దన్, డీపీవో సాయిబాబాతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సింగూరు ప్రాజెక్టు, తంగడపల్లి నీలగిరి ప్రాజెక్టులు, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టుల్లో చేప పిల్లల విడుదలకు అనుకూలమైన వాతవరణం ఉందన్నారు.
నాణ్యమైన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయాలన్నారు. ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించి కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేయాలన్నారు.