
- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు, ప్రాంతీయ శాంతి కమిటీ సభ్యులు పలు సందేహాలు, అభ్యర్థనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ముందుగా ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని... మండపాల వద్ద నాణ్యమైన ఎలక్ట్రికల్ వైర్లను వాడాలని సూచించారు. అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్, డీజేల వినియోగించరాదన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్, ఆర్డీవో రమాదేవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, రంగా కృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.