- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్వెల్ల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. మైనర్ రిపేర్ల కోసం చెక్లిస్ట్ తయారు చేసి గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో పాటు గ్రామాలలో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ బోర్లు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఆఫీస్ లలో లెస్ ప్లాస్టిక్, లెస్ పేపర్ను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఫైల్స్ అన్ని ఈ- ఆఫీసులో ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికారులకు సూచించారు. సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. మంగళవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
