మెదక్ టౌన్, వెలుగు: మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోగా సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం మెదక్కలెక్టర్ఆఫీసులో అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు రికన్సీలేషన్ నిర్వహించారు. ఎన్నికల వ్యయపరిశీలకుడు సంజయ్ కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి రోజువారీ ఖాతా రిజిస్టర్, నగదు లావాదేవీల రిజిస్టర్, బ్యాంక్ రిజిస్టర్, స్టేట్మెంట్ షెడ్యూల్లో 1 నుంచి 11 వరకు గల ఎన్నికల ఖర్చుల వివరాలను సరి చూసుకొని అన్ని బిల్లులను గడువులోగా అందించాలన్నారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్స్లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైన ఖర్చుల తెలియజేయాలని సూచించారు.
ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను సమర్పించని వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈసీ అనర్హులుగా ప్రకటిస్తే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోతారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి రాకేశ్ , ఈడీఎమ్ సందీప్, ఏజెంట్లు పాల్గొన్నారు.