కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా 86 సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపనకు రూ.4 కోట్ల సబ్సిడీ మంజూరుకు ఆమోద ముద్ర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో టీఎస్ ఐపాస్ కింద వివిధ శాఖల నుంచి 592 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామన్నారు. జిల్లాలో 12 భారీ తరహా పరిశ్రమలు నడుస్తున్నాయని, 759 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల ద్వారా 3,732 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పెట్టుబడి వ్యయంలో 45 శాతం ప్రభుత్వమే భరిస్తోందన్నారు. నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పించే ప్యాకేజీలు అర్హులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిని రమాదేవి, డీటీవో ఎర్రి స్వామి, డీపీవో కృష్ణ, ఐపీవో భాస్కర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ రవికుమార్ పాల్గొన్నారు.
శాంపిల్స్ సేకరణలో నిర్లక్ష్యం వద్దు
అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పీహెచ్సీకి వచ్చే పేషెంట్ల టెస్టుల విషయంలో నిర్లక్ష్యం వద్దని, శాంపిల్స్ సేకరించి 3 గంటల్లోగా టీ డయాగ్నిస్టిక్ సెంటర్కు పంపించాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం వైద్యారోగ్య, పీహెచ్సీ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంపిల్స్ రాగానే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోడ్ ఇవ్వాలన్నారు. రిపోర్టులను ఏరోజుకారోజు సంబంధిత పేషెంట్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలన్నారు. డయాగ్నిస్టిక్ సెంటర్తో పాటు అన్ని పీహెచ్సీ, సీహెచ్సీలు తప్పనిసరిగా రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. వీసీలో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ
డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, డీఐవో డాక్టర్ శంకర్ పాల్గొన్నారు.
మార్కెట్ నిర్మాణం స్పీడప్ చేయాలి
జడ్చర్ల, వెలుగు : జడ్చర్ల మండల పరిషత్ఆవరణలో రూ.4 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేట్ మార్కెట్ పనులను స్పీడప్ చేయాలని అడిషన్ కలెక్టర్ తేజస్నందలాల్పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రొగ్రెస్తో పాటు పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఉన్నారు.
రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు
ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో వివిధ మత పెద్దలతో పీస్ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేర్వేరు మతాలకు చెందిన పండగలను కలిసిమెలిసి జరుపుకునే సంప్రదాయం జిల్లాలో ఉందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. గణేశ్ ఉత్సవాల్లో పోలీస్ శాఖ చేసే సూచనలు, రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డీజేలకు అనుమతి లేదని, నిరుడు డీజే వ్యాపారులు, వివాదాస్పద వ్యక్తులను బైండోవర్ చేశామని గుర్తుచేశారు. మతపెద్దలు అందించిన సూచనల మేరకు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, డీఎస్పీ మహేశ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆదినారాయణ, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, రాజేశ్వర్, స్వామిగౌడ్, ఎస్సైలు పాల్గొన్నారు.
నడిగడ్డ ప్రశాంతతకు మారుపేరు
గద్వాల, వెలుగు: నడిగడ్డ ప్రశాంతతకు మారుపేరని, ఇలాగే కొనసాగించాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో వివిధ పార్టీల లీడర్లు, మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు http:// police portal, tspolice gov.in ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు గణేశ్ నిమజ్జన తేదీలు, ర్యాలీ ఏ రూట్లో నిర్వహిస్తారు..? అని వివరాలు పీఎస్లో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, టౌన్ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామీణ రోడ్లను పట్టించుకుంటలే
నేషనల్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి
కల్వకుర్తి, వెలుగు: సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లోని పీఆర్ రోడ్లు, ప్రధానమంత్రి సడక్ రోజ్గార్ యోజన రోడ్లను పట్టించుకోవడం లేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి విమర్శించారు. రెండు రోజుల పాదయాత్రలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి మండలంలోని ఎలికట్ట, తోటపల్లి, బెక్కెర, వేపూరు, తుర్కలపల్లి మీదుగా కల్వకుర్తికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం కల్వకుర్తి నియోజకవర్గం గుండా మూడు జాతీయ రహదారులు మంజూరు చేసి కంప్లీట్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం గ్రామీణ రోడ్లకు కూడా రిపేర్లు చేయండం లేదని మండిపడ్డారు. కనీసం రోడ్లపై పడ్డ గుంతలను కూడా పూడ్చడం లేదన్నారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అసెంబ్లీలో తన సొంత గ్రామానికి రోడ్డు లేదని చెప్పారు గాని, ఇతర గ్రామాల రోడ్ల రిపేర్ల గురించి ప్రస్తావించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు సురేందర్ గౌడ్, కృష్ణ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, దుర్గాప్రసాద్, ఖండే హరి ప్రసాద్, నర్సి రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిమిషం ఆలస్యమైనా రానియ్యం
ఎస్సీ అపూర్వ రావు
వనపర్తి టౌన్, వెలుగు: ఈ నెల 28న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు అభ్యర్థులు నిమిషం లేట్గా వచ్చినా సెంటర్లోకి అనుమతించమని ఎస్సీ అపూర్వ రావు చెప్పారు. ప్రసూతి సెలవులు ముగియడంతో శుక్రవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 9,706 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయనుండగా 36 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు సెంటర్కు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్, పాస్ పోర్టు సైజ్ కలర్ ఫొటో, బాల్ పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెంటర్లోకి 9 గంటల నుంచి అనుమతిస్తామని 10 గంటలకు గేటు మూసేస్తామన్నారు. టైన్లో జిరాక్స్ సెంటర్లు, ఇతర షాపులు తెరవకూడదని ఆదేశించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, నోడల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఎగ్జామ్ను పర్యవేక్షిస్తున్నారని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎస్పీ తిరిగి విధుల్లో చేరడంతో ఎస్పీ ఆఫీస్ సిబ్బందితో పాటు ఇతర పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
చదువుతోనే సమాజంలో గుర్తింపు
మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహదారు అనురాగ్శర్మ
నారాయణపేట, వెలుగు: చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో మధ్యలో ఆపవద్దని మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ సూచించారు. శుక్రవారం రోటరి క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా సహకారంతో జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగి ఈ ప్రోగ్రామ్లో ఆయన మాట్లాడుతూ నారాయణపేట రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా కావడంతో తన వంతుగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తన సతీమణి మమతా శర్మ ఆలోచన మేరకు రోటరీ క్లబ్ వారితో మాట్లాడి అమ్మాయిలకు 800 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సైకిళ్లను అమ్మాయిలే వాడాలని, అమ్మడం గాని, అన్నాదమ్ములకు ఇవ్వడం గాని చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, అరబిందో ఫార్మా చైర్మన్ రఘునాథన్ కన్నన్, రోటరీ క్లబ్ కో ఆర్డినేటర్ ఉదయ్ పిలాని, టి. రాజశేఖర్ , మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మాజీ ఐపీఎస్ మమతా శర్మ, జ్ఞాన ప్రసూన, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.
అలంపూర్ అభివృద్ధికి సహకరించండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం
అయిజ, వెలుగు: ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్ అయిన ఆలంపూర్ అభివృద్ధికి సహకారం అందించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కోరారు. శుక్రవారం అయిజ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి హైదరాబాద్లోని క్యాంప్ ఆఫీస్లో మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ అయిజ మండలం సింధనూర్లో10 బెడ్స్ హాస్పిటల్ నిర్మించాలని, మేడికొండ పులికల్ బీటీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. తుంగభద్ర నది పరీవాహక గ్రామమైన కుట్కనూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి మండలానికి సాగునీరు ఇవ్వాలన్నారు. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు రూ. 5 కోట్ల నిధులతో పాటు కొత్త గ్రామాల్లో బిల్డింగ్స్ కట్టించాలని విన్నవించారు. అనంతరం కుట్కనూర్ లిఫ్ట్ ఏర్పాటు విషయమై ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ను కలసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఉప్పల, సింధనూర్, పులికల్ ఎంపీటీసీలు ప్రహ్లాద్ రెడ్డి, రవిరెడ్డి, నరసింహులు, కలుకుంట్ల సర్పంచ్ ఆత్మలింగారెడ్డి, మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేశ్, మాజీ ఎంపీటీసీ రాముడు, నేతలు వెంకన్న గౌడ్, రామకృష్ణ, రాముడు, రాంబాబు ఉన్నారు.
ఎక్కువ ధరకు ఎరువుల అమ్మకం
ఆందోళనకు దిగిన రైతులు.. 8 షాపులు సీజ్ చేసిన ఆఫీసర్లు
నవాబుపేట, వెలుగు: నవాబుపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్డీలర్లు యూరియా, డీఏపీలను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని శుక్రవారం రైతులు షాప్ల ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మార్పీ రూ. 267 ఉన్న యూరియాను రూ. 330కి, రూ. 1350 ఉన్న డీఏపీని రూ.1600కు అమ్ముతున్నారని ఆరోపించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోతో అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణకిషోర్కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఆయన మేరకు ఫర్టిలైజర్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మండల కేంద్రంలోని 8 ఫర్టిలైజర్ షాప్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు డీలర్లు యూరియా, డీఏపీని ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని ఆదేశించారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
ఆమనగల్లు, వెలుగు: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమనగల్లు పరిధిలోని చంద్రాయన్ పల్లి తండాకు చెందిన జటావత్ భిక్యా(55) శుక్రవారం ఇంటి నుంచి పొలం పనులకు బయల్దేరాడు. విటాయిపల్లి గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా.. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్విఫ్ట్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్యా అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు డెడ్బాడీని ఆమనగల్లు ఆసుపత్రికి తరలించారు. అనంతరం తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ధర్మేష్ అక్కడి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. మృతుని కుటుంబాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబ్ ఆచారి పరామర్శించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
హక్కులు కాపాడేందుకే చట్టాలు
జిల్లా జడ్జి రాజేశ్ బాబు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మన హక్కులను కాపాడుకోవడం కోసమే చట్టాలు ఉన్నాయని జిల్లా జడ్జి డి.రాజేశ్ బాబు తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముదునూరు జడ్పీహెచ్ఎస్లో లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని వాటిని తెలుసుకొని ముందుకు సాగాలన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించకుంటే కొడుకులు శిక్షారులు అవుతారన్నారు. ఇతరుల నుంచి భూములు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా చట్ట ప్రకారం ఉన్నాయా.. లేదా..? చెక్ చేసుకోవాలన్నారు. గ్రామాలలో వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీని వసూలు చేస్తే వారి నుంచి రక్షణ పొందేందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. రైతులు విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు స్వరూప, కీర్తి సింహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, పీపీ శాంప్రసాద్, ఏజీపీ రామచంద్రయ్య, అడ్వకేట్లు తిరుపతయ్య, రాంబాబు, సత్యనారాయణ, జడ్పీటీసీ శ్రీశైలం, సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.
ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి
నారాయణపేట, వెలుగు: క్రీడాకారులు మేజర్ ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకొని అడిషనల్కలెక్టర్ పద్మజారాణి స్టూడెంట్లకు సూచించారు. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పేట క్రికెట్అసోషియేషన్, పీఈటీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్లెవల్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతు క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోని.. ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గుంపుబాల్రాజ్, ఎస్వీఎస్ కాలేజీ ప్రిన్సిపల్ శేషమ్మ, పీఈటీల సంఘం అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి రాకేశ్, నేతలు బాల్రాజ్, తులసి, రాధిక, అక్తర్పాష, రామ్నారాయణ, పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోం
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పేరుతో తొలగిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం అంబేద్క్ చౌక్లో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త బస్టాండ్ నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుపై వివిధ జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నా లేని ఇబ్బంది అంబేద్కర్ విగ్రహంతో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఒక్కసారి జాతీయ నాయకుల విగ్రహలను ప్రతిష్టించిన తర్వాత వాటిని తొలగించే హక్కు ఎవరికీ లేదని చట్టం చెబుతోందని గుర్తుచేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు నాగనమోని చెన్నరాములు, డి.చంద్రయ్య, ఎండీ జబ్బార్, బి.రాములు, మధు, సంతోష్ కుమార్, గంధం నాగరాజు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వండి
జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
గోపాల్ పేట, వెలుగు: గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వాలని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం గోపాల్ పేట మండల ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, రెండుమూడు రోజులకో సారి మీటింగ్ పెట్టుకుంటే ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయవచ్చన్నారు. ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆఫీసర్ల చేసే పనులు అందులో షేర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ భార్గవి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఉసనప్ప, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వైన్స్ సీజ్
పెబ్బేరు, వెలుగు : లిక్కర్ను కల్తీ చేసి అమ్ముతున్న పెబ్బేరులో రఘు వైన్స్ను ఎక్సైజ్ ఆఫీసర్లు సీజ్ చేశారు. ఈ నెల 22న వైన్స్ను తనిఖీ చేసిన ఎస్టీఎఫ్ ఆఫీసర్లు లిక్కర్ను కల్తీ చేస్తున్నట్లు ఇద్దరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేశారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తకోట ఎక్సైజ్ సీఐ ఓంకార్ తన టీమ్తో కలిసి వైన్స్ సీజ్ చేసి తాళం వేశారు.