ఫుడ్లో కొన్ని కాంబినేషన్స్ భలే క్రేజీగా ఉంటాయి. ఆ కాంబినేషన్స్ లేకపోతే తినడమే కష్టమనిపించేంత టేస్టీగా కూడా ఉంటాయి. అయితే, వాటిల్లో కొన్ని ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. అలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా.. భవిష్యత్తులో చాలా సమస్యలొస్తాయి.
ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలేంటో చూద్దామా…
పొత్తు కుదరని పదార్థాలు కలిపి తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పుల్లని తేన్పులు, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులొస్తాయి. మరీ ముఖ్యంగా పాలతో సరిపడని పదార్థాలు కలపడం వల్ల అనారోగ్యం తప్పదు. అందుకే పాలతో కలిపి తినకూడని పదార్థాలేవో తెలుసుకుని, జాగ్రత్తపడాలి!
పాలు, నిమ్మకాయ
పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. అందుకే పాలు, నిమ్మ కాంబినేషన్ వంటకాలకి దూరంగా ఉండాలి. కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పుకి యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. పాలలో న్యూట్రీషనల్ గుణాలుంటాయి. అందుకే ఈ రెండింటినీ మిక్స్ చేయకూడదు. అలాగే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తింటుంటారు చాలామంది. అయితే పాలల్లో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కిచిడీలో కూడా పాలు పోయకూడదు.
నాన్వెజ్
పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తీసుకోకూడదు. పాలలో పూర్తిగా ప్రొటీన్లు ఉంటాయి. అలాగే అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చికెన్లోనూ ప్రొటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఫుడ్ని ఒకే టైంలో తీసుకోవడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే పాలతో కలిపి చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకోకూడదు. రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఒకవేళ ఇవి తీసుకున్న తర్వాత పాలు తాగితే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
ముల్లంగి
డైరీ ప్రొడక్ట్స్ శరీరంలోపల కూల్ చేస్తే.. ముల్లంగి హీట్ పెంచుతుంది. అందుకే .. ఈ రెండింటి కాంబినేషన్ అంతమంచిది కాదు. వీటివల్ల జీర్ణసమస్యలు వస్తాయి. అలాగే పాలను యాంటీ బయొటిక్స్ తో కలపడం వల్ల.. అవి ఇన్ఫెక్షన్లతో పోరాడలేవు. దీనివల్ల.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
అరటిపండు
అరటిపండు, పాలని విడి విడిగా, వేరు వేరు సమయాల్లో తీసుకుంటే చాలా లాభాలుంటాయి. కానీ వీటిని కలిపి తీసుకుంటేనే అసలు సమస్య. ఈహెవీ కాంబినేషన్ మగతను కలిగించి నిద్రకు ప్రేరేపిస్తాయి. అంతేకాదు ఇవి శరీరంలోకి వెళ్లి స్లో పాయిజన్గా మారుతాయి . కొన్ని సందర్భాల్లో ఇవి మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ కాంబినేషన్ను దూరం పెట్టాలి. అరటిపండే కాదు పాలతో ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు. పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. కానీ పాలు అంత ఈజీగా జీర్ణం కాలేవు. కాబట్టి ఈ రెండింటినీ కలపడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. పాలతో కలిపి సిట్రస్ జాతి పండ్లు ఏం తీసుకున్నా సైనస్, దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తాయి. కొన్నిసార్లు ఈ కాంబినేషన్ అలర్జీలకు దారితీస్తుంది. ఒకవేళ, ఈ రెండు పదార్థాలను తింటే రెండింటికీ మధ్య కనీసం గంట వ్యవధి ఉండాలి.