హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్కు హాజరవ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్లో సీఎం ఒమర్ అబ్దుల్లాను శుక్రవారం (డిసెంబర్ 5) మంత్రి ఉత్తమ్ కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ఆహ్వాన పత్రికను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నీతి అయోగ్సలహాలు సూచనలతో పాటు.. అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒమర్ అబ్దుల్లాకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయంగా ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని కానీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.
