- ఆఫీసులకు రండి!
- ఎంప్లాయీస్కు కంపెనీల సూచన
- ఆఫీసులకు వస్తే అదనంగా ఇన్సెంటివ్లు
- కొన్ని చోట్లే హైబ్రిడ్ మోడల్
ముంబై: కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోయింది కాబట్టి ఇంతకుముందు మాదిరే ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కంపెనీలు ఎంప్లాయీస్ను కోరుతున్నాయి. వీరిని తిరిగి రప్పించేందుకు అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఎక్కువ వేరియబుల్ పే, ఎంగేజ్మెంట్ బడ్జెట్ వంటివి ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆఫీసు రావాల్సిన టైం వచ్చేసిందన్న సందేశం పంపేందుకు కంపెనీలు బ్లాంకెట్ ఇంటర్నెట్ రీయింబర్స్మెంట్ వంటి విధానాలను కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇంటర్వ్యూ దశలోనే రిమోట్ వర్క్ను అడిగే కేండిడేట్లకు నో చెబుతున్నాయి. కచ్చితంగా ఆఫీసులోనే పనిచేయాలని అంటున్నాయి. “కొవిడ్ సమయంలో ఎంప్లాయీస్ సొంతూళ్లకు మారడం లేదా చిన్న పట్టణాలకు నగరాలకు వెళ్లడంతో చాలా సంస్థలు వారి జీతాలను తగ్గించాయి. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం వేరియబుల్ పే కాంపోనెంట్ లేదా నాన్-మానిటరీ రివార్డ్లు వంటి వాటిని ఆశచూపుతున్నాయి. అంటే ప్రతి క్వార్టర్లో కొన్ని రోజుల బ్రేక్ ఉంటుంది. కాబట్టి సెలవులు పెరుగుతాయి. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎంప్లాయీస్ చాలా మంది బేస్ లొకేషన్లకు తిరిగి రావొచ్చు" అని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ అండ్ హెడ్ విశాల్లి డోంగ్రీ చెప్పారు.
టీమ్ వర్క్ ముఖ్యం..
ఇంట్లో నుంచి పనిచేయడం కంటే ఆఫీసులో టీమ్గా పనిచేయడం చాలా ముఖ్యమని ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు భావిస్తున్నాయి. భారతీయ సంస్థల ఆలోచనా విధానమూ ఇలాగే ఉంది. యాపిల్ తన ఉద్యోగులను వారానికి కనీసం మూడుసార్లు ఆఫీసుకు రావాలని కోరింది. ప్రతి మంగళవారం, గురువారం, మూడవ రోజు ఆఫీసుకు రావాలని కోరుతూ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ఉద్యోగులకు ఒక మెమోను పంపినట్లు గార్డియన్ తెలిపింది. టీమ్ను బట్టి రోజులు మారుతూ ఉంటాయని పేర్కొంది. “మేము కేండిడేట్లను రిక్రూట్ చేసినప్పుడే ఆఫీసుకు వచ్చే పనిచేయాలని స్పష్టం చేస్తున్నాం. మొదట్లో ఐటీ టెక్ టీమ్లలోని వారి నుండి కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. నిరంతర కమ్యూనికేషన్ ద్వారా ఈ సమస్యను అధిగమించగలిగాం” అని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చీఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదర్శ్ మిశ్రా అన్నారు. అయితే మెరిట్ ఆధారంగా కొందరికే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు.
కన్సల్టింగ్ కంపెనీ కేపీఎంజీ ఇండియా మరింత మంది ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు తీసుకురావడానికి విధానాలను మార్చింది. అందరికీ టీకాలు వేసినందున కరోనా సెలవులను (కొవిడ్ లేదా కేర్గివర్గా) కూడా 14 నుంచి ఏడు రోజులకు తగ్గించింది. తన రీయింబర్స్మెంట్ విధానంలో కూడా మార్పు చేసింది. ఇంతకు ముందు ఇంటి నుండి పని విధానం ఉన్నప్పుడు, ఇంటర్నెట్ రీయింబర్స్మెంట్ కోసం బ్లాంకెట్ మొత్తం ఉండేది. ఇప్పుడు దానిని కేస్ -టు -కేస్ ప్రాతిపదికన ఇస్తున్నది. ఉద్యోగులందరికీ క్రమంగా ఆఫీసులకు తిరిగి వచ్చేలా చూస్తున్నామని భారతదేశంలో కేపీఎంజీ పార్ట్నర్ హెడ్ ( పీపుల్, పెర్ఫార్మెన్స్, కల్చర్) సునీత్ సిన్హా అన్నారు. పోయిన ఏడాదితో పోలిస్తే ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ బడ్జెట్లను 50 శాతం పెంచామని, దీనివల్ల వారు కొత్త విషయాలను నేర్చుకుంటారని చెప్పారు. కేపీఎంజీ ఆఫీస్ పాలసీ ప్రకారం వారానికి రెండు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలి. దీంతో మెజారిటీ ఎంప్లాయీస్ ఆఫీసుకు వస్తున్నారు. “మహమ్మారి ఎక్కువగా ఉన్నప్పుడు, లాక్డౌన్ల సమయంలో తమ వర్క్ఫోర్స్లో దాదాపు 60 శాతం మంది ఇంటి నుంచి పనిచేశారు. ఇది చాలా ప్రాంతాల్లో ఇప్పుడు 20–-30 శాతానికి పడిపోయింది’’అని సిన్హా వివరించారు.