హైదరాబాద్: మరో రెండు రోజుల్లో రంజాన్ పండుగ రాబోతుండడంతో పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నగర కమిషనర్ అంజనీ కుమార్ ఓల్డ్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించామన్నారు. ప్రతీ సంవత్సరం చివరి శుక్రవారం రోజు పాతబస్తీ మక్కా మస్జీద్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించేవారు, కానీ ఈసారి కరోనా వైరస్ ప్రభావంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముందుగానే సూచించామన్నారు
ముందు జాగ్రత్తగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, చార్మినార్, మక్కా మజీద్ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భారీ బందోబస్తు నిర్వహించామని కమిషనర్ చెప్పారు. ముస్లిం సోదరులు మక్కా మస్జీద్ కు ప్రార్ధనల కోసం రాకుండా ఇండ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముస్లింలు అందరూ కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇండ్లలొనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు.