
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేందుకు కమిషనర్లోకేశ్ కుమార్ ఫోకస్ చేశారు. అన్ని జోన్లు, సర్కిళ్ల పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల వరుసగా అధికారులు, సిబ్బంది అవినీతి బయటపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నెలరోజుల్లోనే ఆరుగురిపై వేటు వేశారు. అక్రమంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఏఎంహెచ్ వోను జీహెచ్ఎంసీ నుంచి తొలగించారు. కూకట్ పల్లి జోన్ లో కాంట్రాక్టర్లు డిపాజిట్ చేసిన డీడీలను తప్పుదారి పట్టించినట్లు గుర్తించి ఒకేసారి నలుగురిని సస్పెండ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన కమిషనర్ ఇంకొందరిపై చర్యలు తీసుకోనున్నారు. ముందుగా డిప్యుటేషన్ పై బల్దియా కు వచ్చిన ఆఫీసర్ల పై ఫోకస్ పెట్టారు. ఇటీవల విజిలెన్స్ విచారణ కూడా డిప్యుటేషన్పై వచ్చిన ఆఫీసర్లపైనే కొనసాగడంతో వీరిని సొంత డిపార్టుమెంట్ కి పంపించడం లేదా బదిలీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం ఒకే సర్కిల్, ఒకే పోస్టులో ఐదారేండ్లుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. త్వరలోనే అన్ని సర్కిళ్లలో బదిలీలు కూడా జరగనున్నట్లు తెలిసింది.