స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ

స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ

న్యూఢిల్లీ : స్వలింగ జంటల వివాహానికి చట్టబద్ధత కల్పించే అంశంలోకి వెళ్లకుండా.. వారికి సంబంధించిన కొన్ని ఆందోళనలను పరిష్కరించే దిశగా చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈవిషయాన్ని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్​కు నివేదించారు. స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏడో రోజు (బుధవారం) బెంచ్ వాదనలు విన్నది. “స్వలింగ జంటలకు సంబంధించిన సమస్యల్లో కొన్నిటి పరిష్కారానికి తీసుకోవలసిన పరిపాలనా పరమైన చర్యలను గుర్తించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇందుకోసం వివిధ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం అవసరం. అందుకే కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయదలిచాం. ఇందులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పిటిషనర్లు తమ సూచనలను రాజ్యాంగ  బెంచ్ కు అందించవచ్చు" అని తుషార్ మెహతా ఈసందర్భంగా తెలిపారు. 

రాజ్యాంగం చెప్పేదే ముఖ్యం: సీజేఐ 

సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘పిటిషనర్లు తదుపరి విచారణ జరిగేలోగా వారి సూచనలను సమర్పించవచ్చు" అని వెల్లడించారు. అయితే ఈ సమస్య క్లిష్టంగా ఉందని, చట్టానికి వివరణ ఇవ్వడం అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనానికి  తెలిపారు. "చాలామంది గే యువత  పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.. వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను.. దయచేసి వారి ఆలోచనను పరిగణలోకి తీసుకోవాలి" అని స్వలింగ పిటిషనర్ల తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి సుప్రీం కోర్టు బెంచ్ ను కోరారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ .. " సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగ న్యాయస్థానం. మేం మెజారిటీ ప్రజల ఆలోచనల ప్రకారం కానీ.. కొన్ని వర్గాల ప్రజల ఆలోచనల ప్రకారం కానీ నడుచుకోము. రాజ్యాంగం ఏం చెబుతుందో దాని ప్రకారమే నడుచుకుంటాం. గే యువత  ఏమనుకుంటున్నారో దాని ప్రకారం మేం ముందుకు  వెళితే సమస్య తలెత్తుతుంది. మేము ఈ వాదనను పరిగణలోకి తీసుకుం.. యావత్ దేశానికి ఏది అవసరం అనేదే మాకు ముఖ్యం" అని స్పష్టం చేశారు.