
- సిఫారసు చేసిన కామన్వెల్ స్పోర్ట్స్ఎగ్జిక్యూటివ్ బోర్డు
- నవంబర్ 26న తుది నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ క్రీడారంగానికి గుడ్ న్యూస్. ఇండియాలో చాన్నాళ్ల తర్వాత ఓ మల్టీ స్పోర్ట్స్ మెగా ఈవెంట్ జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు కీలక అడుగు పడింది.
2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ను ప్రతిపాదిస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సిఫారసు చేసింది. దీన్ని కామన్వెల్త్ స్పోర్ట్స్ తమ ఫుల్ మెంబర్స్కు పంపిన తర్వాత నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఒకవేళ ఈ గేమ్స్ ఆతిథ్య హక్కులు ఇండియాకు లభిస్తే 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలనే మన దేశ ఆశయానికి మరింత బలం చేకూరనుంది.
వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్
1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్కు 2030 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. ఈ హిస్టారికల్ సెంచరీ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇండియా దక్కనుంది. ఇంతకుముందు 2010లో న్యూఢిల్లీలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్ను మన దేశంసక్సెస్ఫుల్గా నిర్వహించింది. 72 దేశాలు పోటీ పడే ఈ గేమ్స్ కోసం అప్పట్లో ఇండియా భారీగా ఖర్చు చేసింది. తొలుత గేమ్స్ బడ్జెట్ను రూ. 1600 కోట్లుగా అంచనా వేయగా.. చివరకు 70 వేల కోట్లు ఖర్చు చేశారు.
నైజీరియాతో పోటీలో మనకే మొగ్గు
2030 ఆతిథ్యం కోసం అహ్మదాబాద్తో పాటు నైజీరియాలోని అబూజా నగరం కూడా పోటీపడింది. అయితే, కామన్వెల్త్ స్పోర్ట్.. నైజీరియా బిడ్ను ప్రశంసిస్తూనే , 2034 గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది.
ఆఫ్రికా ఖండంలో కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించాలనే తమ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని ఎగ్జిక్యూటివ్ బోర్డు పేర్కొంది. ‘2030లో వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్కు ప్రతిపాదిత ఆతిథ్య నగరంగా ఇండియాలోని అహ్మదాబాద్ను సిఫార్సు చేస్తున్నట్లు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ధృవీకరించింది’ అని కామన్వెల్త్ స్పోర్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇండియాతో పాటు నైజీరియా సమర్పించిన ప్రతిపాదన కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తాము అహ్మదాబాద్కే మొగ్గు చూపామని కామన్వెల్త్ స్పోర్ట్ తాత్కాలిక ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ రుకారె తెలిపారు.
దేశానికి గొప్ప గౌరవం: పీటీ ఉష
కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సుపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష హర్షం వ్యక్తం చేసింది. ‘వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడం ఇండియాకు అసాధారణమైన గౌరవం కానుంది.
ఈ గేమ్స్ మన దేశంలోని వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్, ఈవెంట్ నిర్వహణ సామర్థ్యాలను ప్రపంచానికి చూపించడమే కాకుండా ‘వికసిత్ భారత్ 2047’ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. 2030 గేమ్స్ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే, ఆటల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే శక్తివంతమైన అవకాశంగా చూస్తున్నాం’ అని ఉష పేర్కొంది.
అన్ని ప్రధాన ఆటలతో 2030 ఎడిషన్
2026లో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ను బడ్జెట్ పరిమితుల కారణంగా కేవలం 10 క్రీడలకు కుదించారు. రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి మెయిన్ స్పోర్ట్స్ను లిస్ట్ నుంచి తొలగించారు. అయితే, 2030లో అహ్మదాబాద్లో జరిగే ఎడిషన్లో అన్ని ప్రధాన ఆటలు ఉంటాయని ఐఓఏ స్పష్టం చేసింది. ‘మనకు పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ వంటి అన్ని క్రీడలను చేర్చాలనేది మా ప్రణాళిక. కబడ్డీ, ఖో-ఖో వంటి మన సాంప్రదాయ క్రీడలు కూడా ఉండాలి’ అని ఐఓఏ జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ చౌబే ఆగస్టులో జరిగిన ఐఓఏ ఎస్జీఎంలో పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ సిద్ధమా?
అహ్మదాబాద్లో ఇటీవలే కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లో, వరల్డ్ లార్జెస్ట్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఆక్వాటిక్స్ సెంటర్, ఫుట్బాల్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కోసం రెండు అరీనాలు ఉన్నాయి.