న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్క్యూట్లో తిరుగులేని విజయాలు సాధించిన ఇండియా స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు... కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఈ నేపథ్యంలో 2018 గోల్డ్ కోస్ట్లో నెగ్గిన సిల్వర్ పతకం రంగును బర్మింగ్హామ్లో మార్చాలన్న ఏకైక లక్ష్యంతో ఈ హైదరాబాదీ బరిలోకి దిగబోతున్నది. మెన్స్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ కూడా ఈ టార్గెట్ను అందుకోవాలని భావిస్తున్నారు. 1966లో దినేశ్ ఖన్నా తొలి బ్రాంజ్ మెడల్ నెగ్గిన తర్వాత ఇండియా ఏడు స్వర్ణాలతో కలిపి 25 పతకాలు సాధించింది.
గోల్డ్ కోస్ట్లో రెండు గోల్డ్స్తో కలిపి ఆరు పతకాలు నెగ్గింది. మరి ఈసారి కూడా అంతకుమించి పతకాలు సాధిస్తారా? లేదా? అన్న ఆసక్తి మొదలైంది. అరంగేట్రంలోనే డబుల్స్లో సిల్వర్ నెగ్గిన చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ కూడా గోల్డ్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే వ్యక్తిగత, డబుల్స్ కంటే 2018 (గోల్డ్కోస్ట్) మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గెలిచి గోల్డ్ మెడల్ను నిలబెట్టుకోవాలన్నదే ఇండియాది అతిపెద్ద టార్గెట్.
