- ఉద్యోగులకు కంపెనీల ఆఫర్
న్యూఢిల్లీ: పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీలను ప్రోత్సహించడానికి చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. వేదాంత, లార్సెన్ & టూబ్రో, మేక్మైట్రిప్ వంటి కంపెనీల్లో పనిచేసేవారికి ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ప్రోత్సాహకాలు వస్తున్నాయి. ఈవీల కొనుగోలు కోసం ప్రోత్సాహకాలను అందించేందుకు ఈ కంపెనీలు ప్రత్యేక విధానాలను రూపొందించాయి. క్యాంపస్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. మెటీరియల్ రవాణా కోసం పూర్తిగా ఈవీలను వాడే ప్రపోజల్ను ఎల్&టీ పరిశీలిస్తోంది.
కార్పోరేట్లు తమ ఉద్యోగుల సాయంతో సస్టెయినబిలిటీ గోల్స్ను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని ఈ కంపెనీల అధికారులు, నిపుణులు చెబుతున్నారు. డెలాయిట్ ఇండియా స్టడీ ప్రకారం, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్(ఈఎస్జీ) దృష్టి కలిగిన కంపెనీల్లో ఇటువంటి విధానాలు ఎక్కువగా ఉంటున్నాయి. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం.. 2070 నాటికి నెట్జీరో ఎమిషన్స్ టార్గెట్ను చేరుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడానికి కంపెనీలు ఈఎస్జీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
"ఇలాంటి ఇన్సెంటివ్లు ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద - 15 శాతం కంటే తక్కువ - సంస్థలే ప్రభుత్వం అందించే రాయితీల కంటే ఎక్కువగా ఈవీలకు ఇన్సెంటివ్స్ అందిస్తున్నాయి" అని డెలాయిట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నీలేష్ గుప్తా అన్నారు. సాధారణ వెహికల్స్, ఈవీల ధరల మధ్య తేడాను తగ్గించడానికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయని గుప్తా చెప్పారు. ఈవీల ధర సాధారణ బండ్ల కంటే 30 శాతం ఎక్కువ ఉంటుందని ఆయన చెప్పారు.
వేదాంత ఇటీవల తన ఉద్యోగులందరికీ టూ, ఫోర్ వీలర్ ఈవీల కొనుగోలు కోసం కోసం 30శాతం నుంచి 50శాతం వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రత్యేక పాలసీ తెచ్చింది. క్లీన్ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల సానుకూల ఫలితాలు వస్తాయని వేదాంత చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మధు శ్రీవాస్తవ అన్నారు.
కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గిస్తరు
"వేదాంతలో మేం పర్యావరణానికి పెద్దపీట వేస్తాం. మా ప్రధాన విలువల్లో ఇదీ ఒకటి. మేం చేసే ప్రతి పనిలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తాం. 2050 నాటికి లేదా అంతకంటే ముందుగానే నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను సాధించడానికి మేం కట్టుబడి ఉన్నాం" అని మధు శ్రీవాస్తవ వివరించారు. ఎల్&టీ 2040 నాటికి కార్బన్ -న్యూట్రల్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. "ఇందుకోసం కంపెనీ లక్ష్య-–26 స్ట్రాటజీ ప్లాన్ను తయారు చేసింది. త్వరగా టార్గెట్ను చేరుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్లు, ఆఫీసులు, ప్రాజెక్ట్ సైట్లలో ఈవీలను వాడటం వంటివి చేస్తున్నాం.
మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కోసం, ఎర్త్-మూవింగ్ ఎక్విప్మెంట్ కోసం ఎలక్ట్రిక్ బండ్లను వాడటంపై స్టడీలు జరుగుతున్నాయి” అని ఎల్ అండ్ టీ సస్టైనబిలిటీ హెడ్ ప్రదీప్ పాణిగ్రాహి అన్నారు. పోవై, చెన్నై, వడోదరలోని ఎల్&టీ క్యాంపస్లలో ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్మైట్రిప్ ఇటీవల ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్లను కొనుగోలు చేసేలా ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని ప్రారంభించింది. ఈవీ మొదటి సంవత్సర బీమా చెల్లించడానికి రూ. లక్ష వరకు ఇస్తామని అని మేక్మైట్రిప్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ యువరాజ్ శ్రీవాస్తవ తెలిపారు. కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించడానికి సహాయపడేలా ఉద్యోగులు నడుచుకోవాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. కొత్తగా ఒక ఉద్యోగి చేరినప్పుడల్లా కంపెనీ వారితో ఐదు చెట్లను నాటిస్తోంది. చెట్ల రకం, వాటిని నాటిన చోటు వంటి వివరాలతో ఉద్యోగికి ఒక సర్టిఫికెట్ను కూడా ఇస్తున్నామని శ్రీవాస్తవ వివరించారు.