- రేట్లు పెంచకపోవడం వలన వచ్చిన నష్టాలను తగ్గించేందుకే..
- తుది దశలో చర్చలు
న్యూఢిల్లీ: ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి కంపెనీలకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెద్దగా పెంచకపోవడం వలన వచ్చిన నష్టాలను కొంత తగ్గించేందుకు రూ. 20 వేల కోట్ల (2.5 బిలియన్ డాలర్ల) ను పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. దేశంలో పెరిగిన ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను కంపెనీలు పెంచకుండా ఉంచాయి. ఫలితంగా దేశంలో 90 శాతం పెట్రోలియం ప్రొడక్ట్లను అమ్ముతున్న ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్కు కలిపి జూన్ క్వార్టర్లో రూ. 18,480 కోట్ల నష్టం వచ్చిందని అంచనా. ఆయిల్ మినిస్ట్రీ రూ. 28 వేల కోట్ల పరిహారాన్ని కోరగా, ఫైనాన్స్ మినిస్ట్రీ మాత్రం రూ. 20 వేల కోట్లను మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో ప్రభుత్వ ప్రకటన వెలువడుతుందని చెప్పారు. మరోవైపు ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం, ఎరువులపై కూడా రాయితీలను ఇస్తోంది. ప్రభుత్వం 2021--–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,800 కోట్లను ఆయిల్పై సబ్సిడీగా ఇచ్చింది. ఫెర్టిలైజర్స్పై సంవత్సరానికి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లను రాయితీగా ఇచ్చింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం ఇవ్వాలనుకుంటే మాత్రం ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడి పెరగొచ్చు. ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందనే వార్తలు వెలువడడంతో హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం షేర్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు మాత్రం పెద్దగా పెరగలేదు. ఈ ఆయిల్ కంపెనీలు 85 శాతం క్రూడాయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని లోకల్గా రిఫైనింగ్ చేస్తున్నాయి. ప్రభుత్వ కంపెనీలు గ్లోబల్గా ఆయిల్ కొని లోకల్గా అమ్మాల్సి ఉంటుంది. కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిఫైనింగ్ పెట్రోలియం ప్రొడక్ట్లను ఎగుమతి చేసుకుని మంచి లాభాలను సంపాదించాయి. ప్రభుత్వ కంపెనీలకు పరిహారంగా రూ. 20 వేల కోట్లు అందితే మాత్రం లోకల్గా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గొచ్చు.
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గట్లే..
గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు దిగొస్తున్నాయి. అయినప్పటికీ లోకల్గా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కు 87 డాలర్ల వద్ద ఏడు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ లెవెల్ నుంచి కొద్దిగా కోలుకొని సోమవారం 94 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ రేటు ఆల్టైమ్ హై అయిన బ్యారెల్కు 140 డాలర్ల నుంచి తగ్గుతూ వస్తోంది. కానీ, క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినంత వేగంగా తగ్గినప్పుడు రేట్లను ప్రభుత్వ కంపెనీలు తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేటు రికార్డ్ లెవెల్కు చేరుకున్నప్పుడు లోకల్గా పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభుత్వ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచలేదని, గత ఐదు నెలలుగా వస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి తాజాగా రేట్లను తగ్గించడం లేదని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కాగా, క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా, సుమారు 158 రోజుల నుంచి లోకల్గా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేకపోవడాన్ని గమనించాలి. లోకల్గా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా ఉన్నందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయని, వాటిని తగ్గించుకోవడానికే ఇప్పుడు ఈ కంపెనీలు రేట్లను సవరించడం లేదని ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు అంటే కిందటేడాది నవంబర్ 4 నుంచి ఈ ఏడాది మార్చి21 వరకు పెట్రోల్, డీజిల్ రేట్లను 137 రోజుల పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 7 వరకు పెట్రోల్పై లీటర్కు రూ.10, డీజిల్పై రూ.10 చొప్పున పెంచాయి. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం, రికార్డ్ లెవెల్కు క్రూడాయిల్ రేటు చేరుకోవడంతో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ను తగ్గించేందుకు ఆ తర్వాత నుంచి కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పుచేయలేదు.
ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గా, డీజిల్ ధర రూ.97.82 గా పలుకుతోంది.
తగ్గుతున్న సప్లయ్..
యూరప్కు గ్యాస్ సప్లయ్ చేసే లైన్ నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ను రష్యా మూసేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాలు తమ ఆయిల్ ప్రొడక్షన్ను తగ్గిస్తామని ప్రకటించాయి. ఈ రెండింటి వలన మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లయ్ తగ్గిపోతుంది. అయినప్పటికీ క్రూడాయిల్ ధరలు తగ్గుతుండడాన్ని గమనించొచ్చు. గ్లోబల్ ఎకానమీ మాంద్యంలోకి జారుకుంటుండడం, అతిపెద్ద క్రూడాయిల్ వినియోగ దేశాలైన యూఎస్, చైనాల ఆర్థిక వ్యవస్థలు స్లోడౌన్లో ఉండడంతో ఆయిల్కు డిమాండ్ తగ్గుతోందని, ఫలితంగా క్రూడాయిల్ రేట్లు పడుతున్నాయని ఎనలిస్టులు వివరించారు. కాగా, ఇండియా దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ బాస్కెట్ రేటు ఈ నెల 8 నాటికి బ్యారెల్కు 88 డాలర్లు పలికింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ ధర సగటున 103 డాలర్లుగా, మే నెలలో 110 డాలర్లుగా, జూన్లో 116 డాలర్లుగా పలికింది. జులై నెల నుంచి తగ్గుతూ వస్తోంది. జులైలో సగటున బ్యారెల్కు 105 డాలర్లు పలికిన క్రూడాయిల్ బాస్కెట్ రేటు, ఆగస్టులో 97 డాలర్లకు, సెప్టెంబర్లో 93 డాలర్లకు దిగొచ్చింది.