న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్లు తమ బ్రాండ్స్ సబ్బుల రేట్లను 15 శాతం దాకా తగ్గించాయి. ప్రధాన ముడిసరుకు పామాయిల్తో పాటు, ఇతర ముడిసరుకుల రేట్లు కిందకి దిగి వస్తుండటమే దీనికి కారణం. లైఫ్బాయ్, లక్స్ సబ్బుల రేట్లను పశ్చిమ ప్రాంతంలో 5 నుంచి 11 శాతం దాకా హిందుస్థాన్ యూనిలీవర్ తగ్గించింది. మరోవైపు గోద్రెజ్ గ్రూప్ కంపెనీ జీసీపీఎల్ కూడా తన నెం. 1 బ్రాండ్ సబ్బు రేటుపై 13 నుంచి 15 శాతం దాకా తగ్గింపు ప్రకటించింది. సబ్బుల రేట్లను కంపెనీలు తగ్గించడంతో ఇప్పటి నుంచి మార్చి దాకా వాల్యూమ్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఇన్ఫ్లేషన్ కారణంగా ఓవరాల్ డిమాండ్ మన దేశంలో నెమ్మదిగానే ఉన్న విషయం తెలిసిందే. గ్లోబల్గా పామాయిల్ రేట్లు కిందకి దిగడంతోపాటు, ఇతర ముడిసరుకుల రేట్లూ తగ్గుముఖం పట్టడం వల్లే సబ్బుల రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. కమోడిటీల రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో సబ్బుల రేట్లు తగ్గించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు జీసీపీఎల్ సీఎఫ్ఓ సమీర్ షా చెప్పారు. అయిదు సబ్బులుండే (ఒక్కోటి 100 గ్రా) నెం. 1 బ్రాండ్ ప్యాక్ రేటును రూ. 140 నుంచి తాజాగా రూ. 120 కి తగ్గించినట్లు పేర్కొన్నారు. లైఫ్బాయ్, లక్స్ బ్రాండ్ల రేట్లను పశ్చిమ భారత దేశంలో తగ్గించామని హెచ్యూఎల్ ప్రతినిధి చెప్పారు. ఇతర ప్రాంతాలలోనూ రేట్లను తగ్గించనున్నారా లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు. అలాగే పశ్చిమ ప్రాంతంలో ఎంత తగ్గించారో కూడా వెల్లడించలేదు. అయితే, అందుబాటులోని సమాచారం ప్రకారం చూస్తే ఈ కంపెనీ పై బ్రాండ్ల రేట్లను 5 నుంచి 11 శాతం దాకా తగ్గించినట్లు అర్ధమవుతోంది. సర్ఫ్, రిన్, వీల్, డోవ్ వంటి బ్రాండ్ల రేట్లను తగ్గించినట్లు వస్తున్న వార్తలను ఆ ప్రతినిధి ఖండించారు. రా మెటీరియల్స్ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ వాటా కాపాడుకోవడానికి ఈ రేట్ల తగ్గింపు నిర్ణయం సాయం చేస్తుందని ఎడిల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈవీపీ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు.