బాల్క సుమన్ అనుచరులపై పీఎస్‌‌లో ఫిర్యాదు

బాల్క సుమన్ అనుచరులపై పీఎస్‌‌లో ఫిర్యాదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని.. ఫోన్ లలో అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థి నాయకులు సురేష్ యాదవ్, నవీన్ యాదవ్ లు వెల్లడించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మీడియా తో మాట్లాడారు. బాల్క సుమన్ రూపంలో నయీమ్ బతికే ఉన్నాడని విమర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ బెయిల్ మంజూరు చేసిన దానిలో ఈటల రాజేందర్ కృషి ఉందన్నారు. ఈ విషయంలో తాము మాట్లాడితే.. బాల్క సుమన్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

విద్యార్థి నాయకుడిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారని, ప్రభుత్వానికి విద్యార్థులకు వారధిగా వ్యవహరించాల్సింది పోయి ఈ విధంగా బెదిరించడం తగదన్నారు. తమకు ప్రాణహాని ఉందని, విద్యార్థుల పక్షాన పోరాడినందుకు తనను చంపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అధికారమదంతో చేస్తున్న దుశ్చర్యలను మానుకోవాలని సూచించారు. బరి తెగించి పకడ్బందిగా బెదిరింపులు కాల్స్ వస్తున్నట్లు.. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ లో బెదిరింపుకు పాల్పడ్డ బాల్క సుమన్ అనుచరులైన టీఆ‌‌ర్ఎస్వీ నాయకులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.