బీఆర్​ఎస్​లో ముసలం.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై హైకమాండ్​కు సీనియర్ల ఫిర్యాదు

బీఆర్​ఎస్​లో ముసలం.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై హైకమాండ్​కు సీనియర్ల ఫిర్యాదు
  • ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై హైకమాండ్​కు సీనియర్ల ఫిర్యాదు
  •     ఈసారి టికెటి ఇవ్వొదంటూ డిమాండ్
  •     హైదరాబాద్ లో నేతల మకాం
  •     అసంతృప్తులకు వేణుగోపాలచారి సపోర్ట్

నిర్మల్​, వెలుగు :  ముథోల్​ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు రోజురోజుకు బయట పడుతున్నాయి. సిట్టింగ్​ ఎమ్మెల్యే విఠల్​రెడ్డిపై ఆ పార్టీ సీనియర్​ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నిన్నటి వరకు ముథోల్​ బీఆర్​ఎస్​లోనూ, ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి పైన ఎలాంటి అసంతృప్తి, అసమ్మతి లేదనుకున్నారు.  మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో  పార్టీ సీనియర్​ నేత  నర్సాగౌడ్  తన అనుచరగణంతో  ఏకంగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిని కలువడం ఇక్కడి రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో అసమ్మతి వర్గం నేతలు హైదరాబాద్​లో మకాం వేసి ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. వీరి వెనక మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి పరోక్షంగా అండదండలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అసమ్మతి నేతలెవరంటే...

ఇప్పటికే ముథోల్​ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్​, బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్​ పటేల్, మాజీ ఎంపీపీ సాయిబాబా, ముథోల్​, బాసర మండలాల కీలక నాయకులంతా ఇటీవల టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిని పార్టీలో చేరేందుకు కలిశారు. తాజాగా భైంసా జడ్పీటీసీ   దీపా తండ్రి సోలాంకీ భీంరావు, బాసర జడ్పీటీసీ వసంత భర్త సౌంవ్లీ రమేష్​,

భైంసా మాజీ జడ్పీటీసీ నీలాబాయి రాంకిషన్​, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావు పటేల్, సీనియర్​ లీడర్​ మధుకర్, విఠల్​లు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది సర్పంచులు, ఎంపీటీసీలు సైతం ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

కొత్త వారికి ఇవ్వాలంటూ..

మొన్నటివరకు ముథోల్​ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. బీఆర్ఎస్​లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తిరుగు లేదని అంతా అనుకున్నారు. అంతలోనే సదరు అసమ్మతి లీడర్లు పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించి కొత్త వారికి టికెట్టు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికే వీరంతా భారీ నీటి పారుదల అభివృద్ధి శాఖ చైర్మన్​ వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్​ రావు తో పాటు మరికొంత మంది లీడర్లను కలిశారు.

ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి టికెట్టు ఇస్తే తాము సపోర్టు చేయబోమని, లేదని పార్టీ ఫిరాయింపులే శరణ్యం చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్​ను సైతం వారు కలుస్తున్నట్లు తెలిపారు.

నేతలను పట్టించుకోకపోవడంతోనే...

కాగా.. అసమ్మతి నేతలంతా హైదరాబాద్​లో ఉంటే..  ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి మాత్రం సెగ్మెంట్​లోనే ఉన్నారు. ఈ నేతలంతా ఎమ్మెల్యేకు పలు విషయాలపై సమస్యలు చెప్పుకోచ్చిన పట్టించుకోకపోవడం కారణమంటున్నారు. బాసర ట్రీపుల్​ఐటీలో మెస్​ కాంట్రాక్టర్లను మార్చాలని, భైంసా హాస్పిటల్​లో సలహా మండలి కమిటీ వేయాలని, కుభీర్​ మార్కెట్​ కమిటీ, బాసర ఆలయ కమిటీ పాలకవర్గాలను నియమించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

అన్ని మండలాల్లో తమకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహించడం సహా సెగ్మెంట్​లో పార్టీని నాశనం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వోద్దంటూ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఏదీ ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే విఠల్​రెడ్డికి అసమ్మతి నేతలతో తలనొప్పి ఉంటుందంటున్నారు.