సిలబస్ పూర్తి చేయకుండానే పరీక్షలు ఎలా పెడతారని ఓయూ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్కి కనీసం 120 పని రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలి.
కానీ వివిధ కారణాల వల్ల ఓయూలో సెమిస్టర్కి రెండు నెలలు కాకుండానే పరీక్షలు పెడుతున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇదే అంశంపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా స్పందన కరవైంది. జులై 19న నిరసన తెలపాలని వీసీ ఛాంబర్కి వెళ్తున్న విద్యార్థులను యూనివర్సిటీ సెక్యూరిటీ హాస్టల్లోనే బంధించారు.
దీంతో ఇంటర్నల్ పరీక్షలను స్టూడెంట్స్ బాయ్కాట్ చేశారు. వర్షంలోనే నిరసనలు కొనసాగిస్తున్నారు. యువతులు లేడిస్ హాస్టల్ ముందు నిరసనలు తెలుపుతున్నారు. సిలబస్ పూర్తయ్యాకే ఎగ్జామ్స్ పెట్టాలని ప్రస్తుతానికి వాటిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఓయూ రోడ్లన్ని మూసివేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసనలు తెలపడం.. అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వాయిదా వేస్తే సమస్యలు తలెత్తుతాయి
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తే అకడమిక్ క్యాలెండర్ సమస్యలు తలెత్తుతాయని ఓయూ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ‘విద్యార్థులు సరైన టైంలో సర్టిఫికెట్లు పొందలేరు. విదేశీ విద్యార్థులకు వీసా సమస్య ఏర్పడుతుంది. చాలా డిపార్ట్మెంట్లలో సిలబస్ పూర్తయింది. కొంత మంది పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే టైమ్టేబుల్ జారీ చేశాం. 28 నుంచి పరీక్షలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.
గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలె
ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షను 3 నెలలపాటు వాయిదా వేయాలని ఓయూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలు, 8న అర్బన్ డెవలప్ మెంట్ ఏవో పరీక్షలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. అదే నెల 29, 30న గ్రూప్- 2 పరీక్ష ఉందని, ఒకే నెలలో ఇన్ని పరీక్షలు రాయడం కష్టమని వారు చెప్పారు.