కొలంబో: తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా డీజిల్ అమ్మకాలను ఆయిల్ కంపెనీలు నిలిపేశాయి. దీంతో రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు.. డీజిల్ లేకపోవడంతో దాదాపు 2 కోట్ల మంది జనం కరెంట్ సరఫరా లేక చీకట్లో మగ్గుతున్నారు. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇదే. నిత్యావసర వస్తువుల దిగుమతులకు అవసరమైన విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
అడుగంటిన ఆయిల్ నిల్వలు
ప్రస్తుతం బస్సులు, కమర్షియల్ వెహికల్స్ ట్రాన్స్ పోర్ట్కు అవసరమైన డీజిల్ నిల్వలు అడుగంటినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా డీజిల్ అమ్మకాలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. పెట్రోల్ మాత్రం అమ్ముతున్నా.. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే నిల్వ ఉన్నట్టు సమాచారం. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర కార్లు బైకులను క్యూలో పెట్టి వాహనదారులు వెళ్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహన దారులు మెయిన్ రోడ్లను బ్లాక్ చేసి నిరసన తెలుపుతున్నారు. కాగా, గురువారం నుంచి 13 గంటల పాటు కరెంట్ కోతలను అమలు చేస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వ రంగ
విద్యుత్ సంస్థ ప్రకటించింది.
రాజపక్స ఇంటి ముందు అర్ధరాత్రి జనం ఆందోళన
తినడానికి తిండి లేక, నిత్యావసరాల కొరతతో విసిగిపోయిన ప్రజలు ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి కొలంబోలోని ఆయన ఇంటిముందు ఆందోళన చేశారు. రెండు వేల మంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపైకి జనం రాళ్లు విసిరారు. ఓ బస్సును ధ్వంసం చేశారు.