ఫాం హౌస్ కేసు :  సిట్ నోటీసుల్లో గందరగోళం

ఫాం హౌస్ కేసు :  సిట్ నోటీసుల్లో గందరగోళం

ఫాం హౌస్ కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసుల్లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. 

సిట్ బీఎల్ సంతోష్‌తో పాటు నలుగురికి జారీ చేసిన నోటీసుల్లో విచారణకు వచ్చేటప్పుడు 9449831415 నంబరు సిమ్‌తో పాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. అయితే ముగ్గురికి ఇచ్చిన నోటీసుల్లో ఒకే నెంబర్ తీసుకురావాలని ఉండటం చర్చనీయాంశంగా మారింది.  కేవలం పేరు, అడ్రస్ మార్చి ఒకే నోటీస్ ను సర్వ్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నోటీసులు అందిన తర్వాత మొబైల్స్‌లోని డేటాను ట్యాంపర్ చేయొద్దని విచారణ అధికారి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి గంగాధర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాసిక్యూషన్‌కు గురవుతామని హెచ్చరించారు. విచారణాధికారులకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నోటీసుల్లో స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. కేసును పర్యవేక్షిస్తున్న సింగిల్ జడ్జి అనుమతి పొందిన తర్వాతే సిట్ నోటీసులు జారీ చేసేలా ఆదేశించాలని కోరింది. కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారని చెప్పారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందని పిటిషన్లో పేర్కొంది.