హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులపై గందరగోళం నెలకొంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించొద్దని ప్రైవేటు యాజమాన్యాలకు సూచించిన డీఈవోలకే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా ప్రభావంతో 2020–21 విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, దాంతో సంబంధం లేకుండా కొన్ని స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. ఫీజులూ దండుకుంటున్నాయి. దీనిపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు డీఈవోలకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లాసులు నిర్వహించొద్దని కొందరు డీఈవోలు ప్రైవేటు స్కూళ్లకు చెప్పారు. దీనిపై స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిత్రా రామచంద్రన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవీ ప్రైవేటు యాజమాన్యాలకు సపోర్ట్ చేసేలాగానే ఉండడం గమనార్హం.
విద్యాసంవత్సరం ప్రారంభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆన్లైన్ క్లాసులపైనా ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా అంటూనే డీఈవోలకూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై మళ్లీ ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ, సర్కారు ఆదేశాలు వచ్చే వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించొద్దని గానీ, కాదని ఆన్లైన్ క్లాసులు పెడితే చర్యలు తీసుకుంటామనిగానీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ఎక్కడా వార్నింగ్ ఇవ్వలేదు. అది పూర్తిగా ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలకు వత్తాసు పలకడమేనని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని ట్రస్మా ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్రావు ప్రకటన విడుదల చేశారు.