- ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు..
- మనుషులా, పశువులా: కేటీఆర్
- తెలివుందా.. మెదడు మోకాళ్లల్లకు జారిందా?
- మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు అంటున్నరు
- మేం ఢిల్లీ, గుజరాత్ గులాములం కాదు: కేటీఆర్
- మేమంతా టీఆర్ఎస్లో సూసైడ్ స్క్వాడ్లం: గంగుల
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు అని, ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులా, పశువులా అంటూ దుయ్యబట్టారు. ‘‘బీజేపీ ఎంపీ ఒకడున్నడు.. వాడు కేసీఆర్, కేటీఆర్ను బియ్యం స్మగ్లరంటడు. దివానాగాడు. వాడు మనిషా..పశువా..? వాడ్ని ఏమనాలె. వాడికి తెలివుందా.. మెదడు మోకాళ్లల్లకు జారిందా? లేక నెత్తిమొత్తం ఖరాబైందా?” అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ పీసీసీ చీఫ్ కాదని, పీసీసీ చీప్ అంటూ విమర్శించారు. ‘‘వాడిని మనిషనలా ఇంకెమానాలె. చిల్లరగాడు” అని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం 20 ఏండ్లుగా పేగులు తెగేదాక కొట్లాడుతున్నామని, ఇకముందు కూడా కొట్లాడుతమని చెప్పారు.
‘‘చిల్లరగాళ్లు, వాడు, వీడు తెలంగాణ గురించి.. సీఎం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. వాళ్ల ఉడుత ఊపులకు భయపడేదే లేదు” అని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలను సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంటు రోగాలు, ఫ్లోరోసిస్ను రూపుమాపామని చెప్పారు. కరీంనగర్కు చెందిన కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ లెక్క తాము ఢిల్లీ, గుజరాత్ గులాములమో, బానిసలమో కాదని, తమకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై వారం రోజులు తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో పేగులు తెగేదాకా అరిచినా, కేంద్రాన్ని నిలదీసినా దున్నపోతుమీద వాన పడిన చందంగా మారిందని, అందుకే పార్లమెంట్ను వీడి ప్రజాక్షేత్రంలో కొట్లాడేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. దేశంలో వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తేవాలని డిమాండ్ చేశారు. బాయిల్డ్ రైస్ను సేకరించబోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోనే యాసంగిలో వరి సాగు చేయొద్దని కోరుతున్నామన్నారు.
మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులు అంటున్నరు
బండి సంజయ్ ఎంపీ అయ్యాక కరీంనగర్కు పైసా తెచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు -– రంగారెడ్డిలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ‘‘ఉద్యమకారులంతా బీజేపీలోకి రావాలని ఒకాయన అంటున్నరు. రాష్ట్రానికి ఏం తెచ్చారని వాళ్లతో కలిసి రావాల్నో చెప్పాలి. దివానా.. పిచ్చిమాటలు తప్ప ఒక్క పని కేంద్రం నుంచి చేయడం లేదు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించి కొనుగోళ్ల విషయంలో యుద్ధ వాతావరణం సృష్టించాలనే కుట్ర చేస్తున్నరు. మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, జైలుకు పంపుతమని అంటున్నరు” అని అన్నారు. ‘‘ధాన్యం కొనుగోళ్లపై ఫిబ్రవరిలో తేలుస్తామని ఒకడు.. బియ్యం స్మగ్లర్లని ఇంకొకడు కారుకూతలు కూస్తున్నరు. బీజేపీలో చేరే నేతలు కేసీఆర్ అంతుచూస్త.. రాజకీయంగా తొక్కుత అంటున్నరు తప్ప తెలంగాణకు ఏం తెస్తరో చెప్పడం లేదు” అని దుయ్యబట్టారు. ‘‘బండి సంజయ్ కాదు.. వాడు తొండి మనిషి, మతి లేదు’’ అంటూ విమర్శించారు.
మేం సూసైడ్ స్క్వాడ్స్లం: గంగుల
పార్టీలో తాము సూసైడ్ స్క్వాడ్స్మి అని మంత్రి గంగుల అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, ప్రచండ సూర్యుడిగా ఉన్న కేసీఆర్ ముందు అవి నిలువవని చెప్పారు.. ‘‘కేసీఆర్ను రక్షించుకుంటే ఆయన మనలను రక్షిస్తరు. కేసీఆర్ గాడ్ ఆఫ్ తెలంగాణ అయితే.. కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ” అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు గాయమైతే కేటీఆర్కు నొప్పి పెడుతుందని, అంతలా కార్యకర్తలను ఆయన కాపాడుకుంటారని గంగుల పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ నాలుగైదు ఏండ్లలోనే చేసి చూపించారని చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు.
రేవంత్కు నెత్తి ఉందా..?
కరోనా టీకా కోసం రాష్ట్రం వందల కోట్లు ఖర్చు చేస్తే రూ.10 వేల కోట్ల కుంభకోణం ఎలా జరిగిందో చెప్పాలని రేవంత్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘‘రేవంత్ చిల్లరగాడని వాళ్ల పార్టీ ఎంపీనే అన్నరు. వాడు పీసీసీ చీఫ్ కాదు, చీప్. సెక్రటేరియట్ కింద నేలమాలిగల్లో గుప్త నిధుల కోసం సెక్రటేరియట్ను కూల్చిన్రని అప్పట్లో చిల్లర ఆరోపణలు చేసిండు. వానికి నెత్తి ఉందా.. అందులో చిప్ ఉందా? వాడిని మనిషి అనాలా ఇంకేమన్నా అనాలా..? రూ. 3 వేల కోట్ల కుంభకోణం బయటపడుతదనే వడ్ల లొల్లి అంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నరు” అంటూ దుయ్యబట్టారు. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష ఎక్కువుందన్నారు. తెలంగాణోళ్లకు పరిపాలన తెల్వది అన్నోళ్లే ముక్కున వేలేసుకునేలా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి, సెక్యూలరిజం టీఆర్ఎస్ ఐడియాలజీ అని పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు అన్నారు. మహాత్మాగాందీ కోరుకున్న అభివృద్ధి తమ ప్రభుత్వం చేస్తోందన్నారు.