సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ల మాటేంటని అధిర్ రంజన్ ప్రశ్న
సొంత లీడర్ కామెంట్స్పై సోనియా గాంధీ ఆశ్చర్యం
జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు –2019పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధురి కామెంట్స్తో లోక్సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. 1948 నుంచి యునైటెడ్ నేషన్స్(యూఎన్)లో నానుతున్న కాశ్మీర్ సమస్యను దేశ అంతర్గత అంశంగా కేంద్రం పరిగణించడాన్ని అధిర్ ప్రశించారు. కాశ్మీర్ ఇష్యూ రెండు దేశాలది కానప్పుడు మనం పాకిస్తాన్తో చేసుకున్న సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ల మాటేంటని అన్నారు. కాశ్మీర్ ఇంటర్నేషనల్ ఇష్యూనే అనే అర్థంలో అధిర్ చేసిన కామెంట్స్పై యూపీఏ చీఫ్ సోనియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందంటూ వెనుక బెంచ్లో కూర్చున్న రాహుల్కు సోనియా సైగలు చేశారు. ‘కాశ్మీర్పై కాంగ్రెస్ స్టాండ్ ఇదేనా?’ అంటూ బీజేపీ ఎంపీలు గట్టిగా అరవడంతో అధిర్ మరోసారి వివరణ ఇచ్చారు. ‘‘గవర్నమెంట్ దగ్గర క్లారిటీ ఉందో లేదో తెల్సుకోవాలనే నేనీ ప్రశ్నలు అడిగాను. మాకేదో దేశభక్తి లేదన్నట్లు ప్రొజెక్ట్ చెయ్యొద్దు. కాశ్మీర్పై కాంగ్రెస్కూ కమిట్మెంట్ ఉంది కాబట్టే పీవోకే కూడా ఇండియాలో భాగమేనని గతంలో తీర్మానం చేశాం’’అని చెప్పారు. కాంగ్రెస్కే చెందిన మరో ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ, కాశ్మీర్ విభజన విషయంలో కేంద్రం రాజ్యాంగాన్ని అవహేళన చేసిందని, పార్లమెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల కామెంట్లకు కేంద్ర మంత్రి అమిత్ షా బదులిస్తూ.. ‘‘కాశ్మీర్ ముమ్మాటికీ ఇండియాలో అంతర్భాగమని ఆర్టికల్ 370లోని 1, సీ నిబంధనతోపాటు జమ్మూకాశ్మీర్ రాజ్యాంగంలోనూ స్పష్టంగా రాసుంది. కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంట్కు ఉంది. ఈ విషయంలో మమ్మల్నెవరూ ఆపలేరు. కాశ్మీర్పై నిర్ణయం పొలిటికల్ వ్యవహారం కాదు. కొత్త చట్టాల వల్ల రాబోయే రోజుల్లో మార్పులొస్తాయి’’అని చెప్పారు.
తీవ్ర పరిణామాలు తప్పవు: 370 రద్దుపై రాహుల్
జమ్మూకాశ్మీర్కు చెందిన ప్రజాప్రతినిధుల్ని అక్రమంగా నిర్బంధించి, రాజ్యాంగ విరుద్ధంగా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినంత మాత్రాన దేశంలో ఇంటిగ్రిటీ పెరగదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ మంగళవారం లోక్సభకు హాజరైనప్పటికీ జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుపై మాట్లాడలేదు. 370 రద్దు, కాశ్మీర్ విభజనపై బీజేపీ నిర్ణయాల్ని సమర్థిస్తూ కాంగ్రెస్ నేతలు కొందరు మాట్లాడటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఒక చారిత్రక తప్పిదాన్ని బీజేపీ సర్కార్ సరిచేసిందన్న కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కేంద్రం నిర్ణయంతో దేశానికి, జమ్మూకాశ్మీర్కు మేలు జరుగుతుందని మరో సీనియర్ నేత దీపేందర్ హుడా అన్నారు.
బ్రెయిన్లెస్ కాంగ్రెస్: మంత్రి నఖ్వీ ఫైర్
గతంలో చేసిన తప్పుల్ని దిద్దుకోవాల్సిందిపోయి కాంగ్రెస్ పార్టీ ఇంకొన్ని మరకలంటించుకుంటున్నదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఎగతాళి చేశారు. ‘‘హెడ్లెస్(నాయకుడులేని) కాంగ్రెస్ ఇప్పుడు బ్రెయిన్లెస్(మెదడులేని) పార్టీగానూ తయారైంది. ఓటమితో వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ పార్టీ నేతలు మానసికంగా దివాళా తీశారు. అధిర్ చౌధురి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా, సోనియా, రాహుల్ వారించకపోవడం ఇంకా దారుణం”అని నక్వీ విమర్శించారు.
తప్పును దిద్దడానికి మళ్లీ తప్పు చేశారు
ఆర్టికల్370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల్ని, పార్టీల్ని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సర్కారు తీరును నిరసిస్తూ టీఎంసీ ఎంపీలు వాకౌట్ చేశారు. మెజార్టీ ఉందికదాని బీజేపీ ఇష్టారీతిగా బిల్లుల్ని పాస్ చేయించుకుంటున్నదని, జమ్మూకాశ్మీర్ని రెండు మున్సిపాలిటీలుగా విభజించారని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు విమర్శించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. అసలు జమ్మూకాశ్మీర్ని ఎందుకు విభజించారో అర్థంకావడంలేదన్నారు. ‘‘గతంలో ఏదో తప్పు జరిగిందని, దాన్ని సవరించడానికి మళ్లీ తప్పుడు మార్గాన్నే ఎంచుకుటే ఎలా? గత ప్రభుత్వానికి, ఇప్పటి సర్కారుకు తేడా ఏముంది? ఫ్రీ ఎలక్షన్స్ గురించి మాట్లాడే బీజేపీ లడక్కు అసెంబ్లీ ఎందుకివ్వలేదు?’’అని సుప్రియ ప్రశ్నించారు.
బక్రీద్కి కాశ్మీరీలనే బలికమ్మంటారా: అసదుద్దీన్ ఓవైసీ
ఆర్టికల్ 370 ఎత్తివేత చారిత్రక తప్పిదమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘‘సోమవారం బక్రీద్ పండుగ ఉంది. మేకలు, గొర్రెలకు బదులు కాశ్మీరీలు తమను తామే బలిచ్చుకోవాలని మోడీ సర్కార్ ఆశిస్తున్నదా? ఒకవేళ అదే మీ కోరికైతే కాశ్మీరీలు దేనికీ భయపడరు. ఆర్టికల్ని రద్దు చేసి బీజేపీ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నా, రాజ్యాంగ విలువల్ని మాత్రం పాతరేసింది’’అని ఓవైసీ విమర్శించారు. కాశ్మీర్ విషయంలో మోడీ సర్కారు నిర్ణయం సరైందేనని వచ్చే ఐదేండ్లలోనే తెలిసొస్తుందని అమిత్ షా కౌంటరిచ్చారు.
అధికారం ఉందికదాని దుర్వినియోగం చేస్తున్నరు: రాహుల్ గాంధీ ట్వీట్
ఈ దేశాన్ని ఒక్కటిగా ప్రజలే నిర్మించుకున్నారు తప్ప ముక్కలైన భూభాగాలతో ఈ దేశం ఏర్పడలేదు.. దీన్ని ఒక్కటిగా ప్రజలే నిర్మించుకున్నారు. చేతిలో అధికారం ఉందికదాని దుర్వినియోగం చేస్తే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.