- పాత హామీలకు జవాబుదారీతనం లేదు.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శ
- బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్
- రైతులు, యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలి: ఖర్గే
- నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరు: రాహుల్
- మోదీ గ్యారెంటీ కాదు.. జుమ్లాల వారంటీ: ఖర్గే
న్యూఢిల్లీ: బీజేపీది సంకల్ప పత్రం కాదని.. అది జుమ్లా పత్రం (అబద్ధాల పత్రం) అని కాంగ్రెస్ విమర్శించింది. గత హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని మండిపడింది. బీజేపీ ఆదివారం విడుదల చేసిన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ చురకలంటించింది. ప్రధాని మోదీ గత హామీలను నెరవేర్చలేదని, మోదీ గ్యారంటీ కాదు.. ‘జుమ్లాల వారంటీ’ (అబద్ధాల వారంటీ) అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ద్రవ్యోల్బణం అదుపులాంటి హామీలను మోదీ నెరవేర్చలేదని, ఇప్పుడు 2047 టార్గెట్ పేరుతో మాటమారుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోకు ‘మాఫీనామా’ అని పేరుపెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. పదేండ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు దేశంలోని రైతులు, యువత, నిరుపేదలు, దళితులకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దేశంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాలే లేవు.’ అని ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ట్విట్టర్లో 14 ప్రశ్నలను సంధించారు.
సంకల్ప పత్రం బూటకం: ప్రియాంకా గాంధీ
బీజేపీ సంకల్ప పత్రం బూటకమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. వారి అసలు మేనిఫెస్టో ‘సంవిధాన్ బద్లో పత్ర’ (రాజ్యాంగాన్ని మార్చే పత్రం) అని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు ప్రతి వీధిలోనూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చెప్పుకొని తిరుగుతున్నారని ఆమె ట్విట్టర్వేదికగా దుయ్యబట్టారు. బీజేపీ మేనిఫెస్టోలో 76 పేజీలు.. 53 కెమెరాజీవి (మోదీ) ఫొటోలు ఉన్నాయని, పదేండ్లలో దేశాన్ని అన్నిరకాలుగా వంచించిన వ్యక్తికి ఇది వీడ్కోలు సందర్భంలాగా ఉన్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ చురకలంటించారు.
పదేండ్లలో ఏమి చేశారో చెప్పాలి: సిద్ధరామయ్య
బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కాదు.. పదేండ్లలో వాళ్లు ఏం చేశారో దేశ ప్రజలకు చెప్పాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అనే హామీలు ఇచ్చి నెరవేర్చలేదని.. వారు భవిష్యత్తులోనూ ఏ హామీని నెరవేర్చబోరని అన్నారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు.
నిరుద్యోగ సమస్యను విస్మరించారు: తేజస్వీ
బీజేపీ మేనిఫెస్టోలో నిరుద్యోగంతోపాటు రైతులు, ద్రవ్యోల్బణంలాంటి సమస్యలను విస్మరించారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్అన్నారు. మేనిఫెస్టోలో ఉద్యోగాలు, ఉపాధికి సంబంధించి ఎక్కడా ఊసే లేదని చెప్పారు. దీన్ని బట్టి ప్రజలకు బీజేపీ ఏమీ చేయదని అర్థమైపోయిందన్నారు. ‘బిహార్కు ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ మాటేంటి? గత లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాలుగానే మిగిలిపోయాయి’ అని విమర్శించారు.
గత హామీల మాటేమిటి?: ఆప్
బీజేపీ మేనిఫెస్టోలో గత హామీలను పొందుపర్చలేదని, అంటే వాటిని నెరవేర్చే ఉద్దేశం లేదా? అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రశ్నించింది. బీజేపీ మేనిఫెస్టోను ‘అబద్ధాల పత్రం’ అని అభివర్ణించింది. బీజేపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ నేత ఆతిశీ స్పందించారు. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని, కానీ పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అనే డేటాను సంకల్ప పత్రంలో పొందుపర్చలేదని అన్నారు. దేశంలోని యువత నిరుద్యోగంతో ఆందోళన చెందుతున్నారని, ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 300 నుంచి రూ.1200కు పెరిగిందని, పెట్రో ధరలు పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ధరలతో దేశంలోని ప్రతి కుటుంబం ఇబ్బందులు పడుతున్నదని, మోదీ జుమ్లా పత్రాన్ని ఎవరూ నమ్మరని అన్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఊసే లేదు: రాహుల్గాంధీ
బీజేపీ మేనిఫెస్టోలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఊసే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. ‘ఇండియా కూటమి ప్రణాళిక క్లియర్గా ఉంది. 30 లక్షల ఉద్యోగాలు.. రూ. లక్ష వేతనంతో యువతకు జాబ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సారి నిరుద్యోగులు మోదీ ఉచ్చులో పడరు’ అని పేర్కొన్నారు. యువత కాంగ్రెస్తో చేతులు కలుపుతుందని, దేశంలో ఉపాధి విప్లవాన్ని సృష్టిస్తామని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.