
- కీలక నేతలు, సీనియర్లు ఓడిపోతారంటూ రిపోర్ట్
- ఓడిపోయే నేతల లిస్ట్ లో మాజీ పీసీసీ చీఫ్పేరు కూడా
- 20–30 సెగ్మెంట్లలో క్రాస్ సర్వే చేయిస్తున్న పెద్దలు
- ఆ తర్వాతే అసెంబ్లీ టికెట్ల కేటాయింపు..!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ నాయకత్వం.. అభ్యర్థుల స్క్రీనింగ్ లో బిజీగా ఉంది. అయితే ఇటీవల పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే ఆధారంగా చేసుకొని, పార్టీకి చేసిన సేవలు, సామాజిక వర్గం, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకొని టికెట్ కేటాయించాలని భావించింది. అయితే సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వేపై కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. దాదాపు 20 నుంచి 30 స్థానాల్లో బరిలోకి దిగాలనుకుంటున్న పార్టీ ముఖ్యనేతలు ఓడిపోవడం ఖాయమని ఎస్కే తన సర్వేలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఓడిపోయే వారి జాబితాలో ఓ మాజీ పీసీసీ చీఫ్ పేరు కూడా ఉండటం విస్మయం కలిగిస్తోంది.
దీంతో పాటు ఓ ఎంపీ సతీమణి కూడా గెలిచే అవకాశాలు తక్కువని పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో సునీల్ కనుగోలు చేపట్టిన సర్వేపై కాంగ్రెస్ ముఖ్యనేతలు ఏఐసీసీ అగ్రనేత వద్ద అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. సర్వే నివేదికలు పరిశీలించిన రాహుల్ తానే స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ప్రత్యేకంగా 20 నుంచి 30 సెగ్మెంట్లలో క్రాస్ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సునీల్ కనుగోలును ఎవరైనా ప్రభావితం చేశారా..? సర్వే నివేదిక కరెక్టేనా..? అని తెలుసుకొనేందుకే ఈ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఆ నివేదిక అందిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని తెలుస్తోంది.
రేపు స్క్రీనింగ్ కమిటీ భేటీ
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. మురళీధరన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో టికెట్ల అంశం కొలిక్కి వస్తుందా..? ఎన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను తేల్చుతారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.