V6 News

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్‌పై చర్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్‌పై చర్యలు

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై పార్టీలు చర్యలు తీసుకుంటున్నాయి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్‌ ను అన్నీ పదవుల్లో నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.జి. వేణుగోపాల్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. హర్యానాలో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్ ఓటమికి కారణమయ్యాడని పార్టీ భావించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసినట్లు గుర్తించింది.

పార్టీ అభ్యర్థికి మొత్తం 31 ఓట్లు రావాల్సి ఉంటే.. 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ స్వల్ప తేడాతో ఆయన్ను ఓడించారు. ఇక్కడ వారిద్దరూ గెలుపొందారు. హర్యానా అసెంబ్లీలో 90 మంది సభ్యులుంటే.. 89 మంది ఓటు వేసినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా బిష్ణాయ్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం కావాలని భావించినా.. అది ఫలించలేదు. మొత్తం నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.