టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో భూస్థాపితం కావడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ మాజీ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని ఆయన ఆరోపించారు. తన అనుచరుల ఒత్తిడి మేరకు.. తాను టీఆర్ఎస్లో చేరబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొండాపూర్లోని తన నివాసంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.
‘హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఇంచార్జ్ను నియమించమంటే.. నియమించకుండా రేవంత్ రెడ్డి టైం పాస్ చేశాడు. హుజురాబాద్లో పోటీచేద్దాం.. గెలుద్దామని చెప్తే పట్టించుకోలే. పీసీసీ ప్రెసిడెంట్కే పోటీ చేయడంపై ఇంట్రస్ట్ లేదు. రేవంత్ నమ్మించి నా గొంతు కోశారు. ఈటల గెలుస్తారు, కాంగ్రెస్ గెలువదు అని రాష్ట్ర అధ్యక్షుడే అనడం ద్రోహం కాదా? తమ్ముడు లాంటి నన్ను రేవంత్ రెడ్డి ఎలా మోసం చేస్తారు? కరీంనగర్కు చెందిన ఓ సీనియర్ నాయకుడు.. రేవంత్ను తప్పుదోవ పట్టిస్తున్నాడు. హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీని పొన్నం ప్రభాకర్ నాశనం చేస్తున్నాడని రేవంత్కు చెప్పినా పట్టించుకోలేదు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో భూస్థాపితం కావడం ఖాయం. రేవంత్ నాకు అన్యాయం చేశాడు. తమ్ముడు అని చెప్పుకునే నా ఎన్నికనే ఆయన పట్టించుకోకపోతే.. ఇంక ఏ ఎన్నికను పట్టించుకుంటారు. రేవంత్ రెడ్డివి అన్నీ దుందుడుకు చర్యలే’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.