జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు

జూన్ 2న ఉదయం.. సాయంత్రం ఆవిర్భావ వేడుకలు
  •     పొద్దున పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ జెండా ఆవిష్కరణ
  •     ప్రసంగించనున్న సోనియా, సీఎం
  •     అక్కడే రాష్ట్ర గీతం విడుదల
  •     సాయంత్రం ట్యాంక్​బండ్​పై సంబురాలు.. 700 మందితో కళారూపాల కార్నివాల్
  •     5 వేల మందితో ఫ్లాగ్​ వాక్.. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్​ వెర్షన్​ ప్లే

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహిస్తారు. జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్​ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్​ నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్​లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. అక్కడే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. 

అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం ట్యాంక్ బండ్​పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై  ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్​కు సీఎం రేవంత్​రెడ్డి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.  

ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసే వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’  ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని  ప్లే చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్​ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులతో వేడుకలను ముగిస్తారు.