- హోటల్స్, ఎయిర్ పోర్ట్ కో ఆర్డినేషన్ చూడనున్న ఏఐసీసీ సెక్రటరీలు
- అతిథుల ట్రావెల్ ప్లాన్ కోసం కంట్రోల్ రూం.. తొలి రోజు మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సీడబ్ల్యూసీ సమావేశాలపై కాం గ్రెస్ హైకమాండ్ షెడ్యూల్, గైడ్లైన్స్ విడుదల చేసింది. సమావేశాలకు హాజరయ్యే ఒక్కో అతిథికి ఒక్కో ప్రొటోకాల్ ఆఫీసర్ను నియమించింది. కార్యక్రమాలకు సంబంధించిన కో ఆర్డినేషన్ను ఆ ప్రొటోకాల్ ఆఫీసరే చూసుకోనున్నారు. స్థానికంగా కో ఆర్డినేషన్ కోసం ఏఐ సీసీ ఇన్చార్జి సెక్రటరీలతో మాట్లాడాల్సిందిగా గెస్ట్లకు సూచనలు చేసింది. హోటల్ అకామిడేషన్ కోసం పీసీ విష్ణునాథ్, రోహిత్ చౌదరి, ఎయిర్పోర్ట్ కో ఆర్డినేషన్ బాధ్యతలను మన్సూర్ అలీఖాన్కు అప్పగించింది.
సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుందని తెలిపింది. సీడబ్ల్యూసీ సభ్యులు, సీఎంలు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల కల్లా హైదరాబాద్కు చేరుకోవాలని పేర్కొంది. తర్వాతి రోజు జరిగే మీటింగ్కు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, సీఎల్పీ నేతలు, పీసీసీ చీఫ్లు, ఆఫీస్ బేరర్లు శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం కల్లా హైదరాబాద్కు చేరుకోవాలని తెలిపింది. ఆదివారం సభ పూర్తయ్యాక పీసీసీలు, సీఎల్పీ నేతలు, ఆఫీస్ బేరర్లు వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లిపోవాలని వెల్లడించింది. రాత్రి బస నియోజకవర్గాల్లోనే చేయాలని పేర్కొంది. కాగా, సీడబ్ల్యూసీ మీటింగ్కు హాజరయ్యే గెస్టుల ట్రావెల్ ప్లాన్ కోసం ఏఐసీసీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. వివరాలను వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపించాలని సూచనలు చేసింది.