మందమర్రి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.30వేల కోట్లు లంచం తీసుకున్నాడని మాజీ విప్, కాంగ్రెస్ లీడర్ నల్లాల ఓదెలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మందమర్రిలో ఆజాద్కి గౌరవ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక దొరలబంగ్లా ఏరియాలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, నల్లాల ఓదెలు యాత్రను ప్రారంభించారు. ఓదెలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశానవాటికల పేరుతో దళితుల భూములను గుంజుకున్నాడన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో రజాకార్లపాలన సాగిస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ పాదయాత్రకు వచ్చే వాళ్లను టీఆర్ఎస్లోని దొంగలీడర్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ అడ్డుకుంటున్నాడని, అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అరెస్టులు చేయిస్తే పోలీస్స్టేషన్ల ముందే కూర్చుంటామన్నారు. తమవారిపై దాడులు చేయిస్తే ఎమ్మెల్యే ఆఫీస్ను కాలవెట్టడానికి కూడా వెనుకడబోమన్నారు. బాల్కసుమన్ను నియోజకవర్గం నుంచి తరిమికొట్టాల్సిన బాధ్యత సింగరేణియులు, యువతపై ఉందన్నారు. ఐఎన్టీయూసీ జనరల్సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, తేజావత్రాంబాబు, మండ భాస్కర్, వెంకటస్వామి పాల్గొన్నారు.