న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే జంగల్ రాజ్(ఆటవిక రాజ్యం)కి గ్యారెంటీ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. బీజేపీ, మోదీ అసత్యాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలే అతిపెద్ద ఉదాహరణ అని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన యూపీలో మహిళలపై ఇటీవల జరిగిన అనేక నేరాలను ఎత్తిచూపారు. మైనర్ సోదరీమణుల మృతదేహాలు చెట్లకు వేలాడాయని, ఐఐటీ బీహెచ్యూ స్టూడెంట్పై బీజేపీ కార్యకర్తల సామూహిక అత్యాచారం, న్యాయం లభించక ఆత్మహత్యకు పాల్పడిన మహిళా జడ్జి, రాంపూర్లో 10వ తరగతి పరీక్షలు రాసి తిరిగి వస్తున్న దళిత విద్యార్థిని హత్య తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ, నేరస్థుల కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.