సోల్జర్ల మరణానికి కేంద్రానిదే బాధ్యత: రాహుల్ గాంధీ

సోల్జర్ల మరణానికి  కేంద్రానిదే బాధ్యత: రాహుల్ గాంధీ
  • ఎన్డీయే సర్కారుపై రాహుల్ ​గాంధీ ఫైర్​
  • దోడాలో అమరులైన జవాన్లకు నివాళి

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ అన్నారు. భద్రతా లోపాలకు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బాధ్యత వహించాలని, ఇది ప్రతి దేశభక్తుడి డిమాండ్​ అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్​లోని దోడా ఉగ్రదాడిలో మృతిచెందిన నలుగురు జవాన్లకు మంగళ వారం ఆయన ట్విట్టర్​(ఎక్స్​) వేదికగా నివాళులర్పించారు. అమర జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

ప్రభుత్వ విధానాలే కారణం

జమ్మూకాశ్మీర్‌లోని పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని రాహుల్​గాంధీ విమర్శించారు.‘‘ఈ వరుస దాడులు జమ్మూకాశ్మీర్​లో దయనీయ పరిస్థితులను తెలియ జేస్తున్నాయి. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాలను సైనికులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

దేశం మొత్తం టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు రాజకీయ ఐక్యత అవసరమని, రోజురోజుకూ పెరుగుతున్న టెర్రరిజం ముప్పును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.