కోజికోడ్(కేరళ) : కొందరు రాజకీయ నాయకుల సాధారణ వస్త్రధారణ చూసి వారిపై ఒక అంచనాకు రాకూడదని.. వారి అసలు స్వరూపం మరోలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని కొజికోడ్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు, కేరళ శాసనసభలో 9వ ప్రభుత్వ చీఫ్ విప్ దివంగత సీతీ హాజీ ‘శాసనసభ ప్రసంగాల’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బుధవారం రాహుల్పాల్గొన్నారు. సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా కనిపించే కొందరి నాయకులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ..
కొందరు రాజకీయ నాయకులు తాము సాధారణ జీవితం గడుపుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. ‘‘నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను కలిశాను. కొందరు నాయకులు ఖరీదైన దుస్తువులు, చేతి గడియారాలు ధరించకుండా తాము చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి.. వారి పిల్లల్ని చూస్తే ఆ నాయకుల నిజస్వరూపం తెలుస్తుంది.
వాళ్ల ఇళ్ల వద్ద ఖరీదైన కార్లు ఉంటాయి. ప్రజల దగ్గర వారి అసలు రూపాన్ని దాచగలరు కానీ.. అది వారి పిల్లల విషయంలో సాధ్యపడదు’’ అని రాహుల్ అన్నారు. హాజీని తాను ఎన్నడూ కలవలేదని, ఆయన కొడుకు పీకే బషీర్ని చూసి హాజీ ఎలాంటి వ్యక్తో తాను నిర్ణయించగలనని రాహుల్ పేర్కొన్నారు.