గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉన్న రాహుల్..15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సన్యాసి, పండితుడు శ్రీమంత శంకరదేవ జన్మస్థలమైన నాగావ్లోని బటడ్రావ సత్ర ఆలయ దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. గుడి లోపలికి అనుమతించకపోవడంతో వాగ్వాదానికి దిగారు.
‘నేను ఎందుకు లోపలికి వెళ్లకూడదు.. నేనేం నేరం చేశాను. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నరు. మేం ఎటువంటి సమస్యలను సృష్టించాలని అనుకోవడం లేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి?’ అంటూ రాహుల్గాంధీ అధికారులను నిలదీశారు. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయం లోపలికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ అక్కడే ధర్నాకు దిగారు. నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తమను అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.