బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే : షబ్బీర్​ అలీ

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే : షబ్బీర్​ అలీ

కామారెడ్డి, వెలుగు :  బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని, పైకి మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిచుకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు.  సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక మీటింగ్​  నిర్వహించారు. సమావేశంలో షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. లిక్కర్​కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్​ చేసి జైలులో పంపిన కేంద్రప్రభుత్వం కవితను ఎందుకు అరెస్ట్​చేయలేదని ప్రశ్నించారు.  దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ ​ఒక్కటేనని అర్థమవుతోందన్నారు.

కాంగ్రెస్​ అధిష్టాన నిర్ణయం మేరకు కామారెడ్డిలో కేసీఆర్​పై రేవంత్​రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. రేవంత్​రెడ్డి గెలుపు కోసం  కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడాలన్నారు. కార్యకర్తలు పార్టీని గెలిపిస్తే ఐదేండ్లు మీకు పార్టీ సేవ చేస్తుందన్నారు. 10న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలన్నారు. 9న నిజామాబాద్ అర్బన్​లో తాను నామినేషన్ ​వేస్తానన్నారు. బండి సంజయ్​ను స్టేట్​అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ, బీసీని సీఎం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కామారెడ్డిలో సమన్వయం కోసం పార్టీ వేం నరేందర్​రెడ్డి, అరికెల నర్సారెడ్డి,  కొండల్​రెడ్డిని నియమించిందన్నారు. మీటింగ్​లో నేతలు వేం నరేందర్​రెడ్డి, నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్లు మానాల మోహన్​రెడ్డి, శ్రీనివాస్​రావు, జడ్పీ ఫ్లోర్​లీడర్ ​మోహన్​రెడ్డి, మున్సిపల్ వైస్​ చైర్​పర్సన్​ఇందుప్రియ, లీడర్లు పండ్లరాజు, ఇంద్రాకరణ్​రెడ్డి, అశోక్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, చందు పాల్గొన్నారు.