
బెల్లంపల్లి/కోల్బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం చెన్నూరు, మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు, భీమారం మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మాల మహానాడు నేతలు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీస్లో సోషల్ మీడియా టీమ్, యూత్ కాంగ్రెస్కార్యకర్తలు పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు.
మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి సబ్బని రాజనర్సు, నేతలు బెల్లంపల్లి పట్టణంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ గడ్డం వంశీకృష్ణ కష్ట పడి పనిచేస్తున్నారని అన్నారు. తాత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, తండ్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.
గెలిచిన ఏడాది కాలంలోనే పార్లమెంట్ నియోజక వర్గానికి సుమారు రూ.300 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత ఎంపీ వంశీకృష్ణకే దక్కుతుందన్నారు. రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10వేల ఇవ్వాలని పోరాడి పెన్షన్ ఫండ్కు రూ.144 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.