- పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు లేవని, కలిసి కట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో కామారెడ్డి మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికకు సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఇన్చార్జి మంత్రి మహమ్మద్ అజారుద్ధీన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, అభ్యర్థుల ఖరారు పై చర్చించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలతో పాటు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ల కేటాయింపు అంశంపై చర్చ జరిగింది. విభేదాలను పక్కన పెట్టి జిలాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయటమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అనంతరం కామారెడ్డి కి సంబంధించి బీ-ఫారాలను అందించారు.
పాత, కొత్త వారికి సీట్ల సర్దుబాటు..
కాంగ్రెస్ లో ఉన్న పాత, కొత్తగా చేరిన నాయకుల మధ్య సీట్ల సర్దుబాటుపై ముఖ్య నేతలు చర్చించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సూచించిన వారికి మెజార్టీ వార్డులను ఖరారు చేయనుండగా, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్రెడ్డి వర్గానికి వారు కోరిన విధంగా వార్డుల్లో టికెట్లు ఇవ్వాలని ముఖ్య నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
