‘ఖని’ చౌరస్తా లో కాంగ్రెస్ భారీ రాస్తారోకో

‘ఖని’ చౌరస్తా లో కాంగ్రెస్ భారీ రాస్తారోకో

ఎమ్మెల్యే చందర్​ తన ప్రమేయం లేదని ప్రమాణం చేస్తాడా? 
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్
‘ఖని’ చౌరస్తా లో భారీ రాస్తారోకో
అరెస్ట్​ చేసి పీఎస్​కు తరలింపు 

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిన కేసులో నిందితులపై పీడీయాక్టు అమలు చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ ​కుమార్​, రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జి మక్కాన్ సింగ్​రాజ్​ఠాకూర్​ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ఆర్ఎఫ్​సీఎల్​ బాధితులకు న్యాయం చేయాలని పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మోహన్ గౌడ్​, గుండు రాజులకు సబ్ కాంట్రాక్టు ఇప్పించే విషయంలో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరు కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. బాధితులు స్వయంగా ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది చెప్పినప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోనే హరీశ్​ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆర్​ఎఫ్​సీఎల్​ బాధితుడు హరీశ్​ కుటుంబానికి రూ.కోటి ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్​ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రం పర్యటనకు వస్తున్న సందర్భంగా సభా వేదిక పైనుంచి ఆర్ఎఫ్​సీఎల్ బాధితులకు పరిహారాన్ని ఇప్పించేలా ప్రకటన చేయాలన్నారు. రాస్తారోకోలో కార్పొరేటర్లు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాపా, రహీమ్, మారెల్లి రాజిరెడ్డి, పాల్గొన్నారు.

భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర
హుజూరాబాద్  : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం కోసం అప్పులు చేసి దళారికి రూ.లక్షలు ముట్టజెప్పి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్న హరీశ్​అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. హరీశ్ ​స్వగ్రామమైన కరీంనగర్ ​జిల్లా అంబాల పూర్ ఆదివారం భారీ పోలీస్ బందోబస్తుతో అంతిమయాత్ర సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త వాతావారణం చోటుచేసుకుంది. హరీశ్​ డెడ్​బాడీ కరీంనగర్ ప్రభుత్వ దవాఖానా నుంచి శనివారమే వచ్చినా హరీశ్​బాబాయి లింగమూర్తి, నానమ్మ తీర్థయాత్రలకు వెళ్లడంతో రావడానికి ఆలస్యమైంది. విషయం తెలుసుకుని ఆదివారం తిరిగి రావడంతో దహన సంస్కారాలను ఆదివారం నిర్వహించారు. హరీశ్​ మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర పార్టీల లీడర్లు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.