- మొత్తం 20 ఎంపీ స్థానాల్లో 16 కాంగ్రెస్ పార్టీకే
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్, ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్య పొత్తు ఖరారు అయ్యింది. మొత్తం 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 16, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 2, కేరళ కాంగ్రెస్ (జే) 1, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. బుధవారం కేపీసీసీ చీఫ్ కె.సుధాకరన్, యూడీఎఫ్ చైర్మన్ వీడీ. సతీశన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టమైన అవగాహన వచ్చిందని, త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. ఐయూఎంఎల్ ఈసారి కూడా మలప్పురం, పొన్నాని స్థానాల్లోనే పోటీ చేస్తుందన్నారు. కొల్లాంలో ఆర్ఎస్పీ, కొట్టాయంలో కేరళ కాంగ్రెస్ (జె) పోటీ చేయనున్నట్లు వివరించారు.