- ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు
- హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్
- మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న నేతలు
- అసెంబ్లీ ఎన్నికల టైమ్లోనూ తుక్కుగూడ మీటింగ్లోనే ఆరు గ్యారంటీల ప్రకటన
- అదే సెంటిమెంట్తో ఎంపీ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ పార్టీ.. ఈ మీటింగ్ తోనే ప్రచారాన్ని షురూ చేయాలని భావిస్తున్నది.
ఈ బహిరంగ సభకు అటెండ్ కావాలని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనకు ఏఐసీసీ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో గల తుక్కుగూడలో సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. సుమారు 10 లక్షల మంది అటెండ్ అయ్యేలా ఈ మీటింగ్కు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్కు సెంటిమెంట్గా తుక్కుగూడ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది సెప్టెంబర్ 16,17 తేదీల్లో రెండు రోజుల పాటు తుక్కుగూడలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ ను ఏఐసీసీ నిర్వహించింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పార్టీ నేతలంతా ఈ మీటింగ్కు హాజరయ్యారు.
17న నిర్వహించిన మీటింగ్ లో సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మీటింగ్ తరువాత ఆరు గ్యారంటీలు క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లాయి. కాగా, ఆ మీటింగ్ కు సుమారు 6 లక్షల మంది వచ్చినట్టు అప్పటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.
అయితే, అప్పుడు ఆ మీటింగ్ సక్సెస్ కావొద్దని హైదరాబాద్ లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ తో పాటు అప్పటి సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించినప్పటికీ ఆ రెండు మీటింగులు ఫ్లాప్ అయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడ మీటింగ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయి కాంగ్రెస్లో కొత్త జోష్ నింపింది. దీంతో కాంగ్రెస్ కు తుక్కుగూడ సెంటిమెంట్గా మారిందని, ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే తుక్కుగూడ ప్లేస్ ను సెలెక్ట్ చేశామని పార్టీ నేతలు చెప్తున్నారు.
తెలుగులో మేనిఫెస్టో విడుదల
తుక్కుగూడ పబ్లిక్ మీటింగ్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ మేనిఫెస్టోను తెలుగులో రిలీజ్ చేస్తారని పీసీసీ నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం 5 కేటగిరీల వారీగా 25 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబై లో నిర్వహించిన భారత్ జోడ్ న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ “ఫైవ్ న్యాయ్” పేరుతో కిసాన్, యువ, నారీ, శ్రామిక్, హిస్సేదారీ ఇలా.. ఒక్కో వర్గానికి 5 హామీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.