రేవంత్ చెంచాగాళ్ల ట్రోల్స్ ఎక్కువైనయ్.. ఫిర్యాదు చేస్త

రేవంత్ చెంచాగాళ్ల ట్రోల్స్ ఎక్కువైనయ్.. ఫిర్యాదు చేస్త

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత,  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్ తీరు బాగా లేదని, ఇలాగే కొనసాగితే పార్టీ నడపడం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే అంతా అన్నట్లుగా ఎవరితో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో నేతల మధ్య విభేదాలు వచ్చాయని జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే హీరో.. మిగతావాళ్లంతా కోవర్టులు అన్నట్లుగా రేవంత్ చెంచాగాళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. దళిత గిరిజన సభల్లో ఇతర నేతలు మాట్లాడుతుంటే.. గో బ్యాక్ అంటూ రేవంత్ మనుషులు అన్నారని, ఇదెక్కడి పద్ధతని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తి మాట్లాడుతుంటే వద్దంటూ నినాదాలు చేశారని, ఈ తీరు పార్టీకి మంచిది కాదని అన్నారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోకుంటే పార్టీని నడిపించడం కష్టమని, తాను మాత్రం పార్టీ మారబోనని, ఆయన తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు.

ఇవాళ రేవంత్ జహీరాబాద్‌కు వెళ్లారని, మూడు సార్లు ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తన జిల్లాకు వస్తున్నట్లు కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయన వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు. అధిష్టానం నియమించిన పొలిటికల్ యాక్షన్ కమిటీలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడని, రెండు నెలల కార్యాచరణను రేవంత్ ప్రకటించేశాడని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ మధ్య తాను గ్యాప్‌ క్లియర్ చేద్దామనుకున్నానని, కానీ రేవంత్‌కు సర్దుకుపోయే ఉద్దేశం లేదని, కోమటిరెడ్డి ఎప్పుడెప్పుడు పార్టీ నుంచి బయటకు పోతాడా అని ఎదురుచూస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇలా ఒక్కడే హీరో అనేది కాంగ్రెస్ పార్టీలో నడవదని, రేవంత్ వచ్చాకే కాంగ్రెస్‌లో ఊపొచ్చిందన్నది ఉత్తమాటేనని, 2017లో తాను సంగారెడ్డిలో పెట్టిన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, అప్పట్లో ఆయనెక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తమ పార్టీకి సోనియా, రాహుల్ గాంధీలే హీరోలని, రేవంత్ తీరుపై చాలా అనమానాలు ఉన్నాయని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బైడెన్‌.. మా కష్టాలపై మోడీతో మాట్లాడండి

టీడీపీకి పట్టిన గతే టీఆర్‌‌ఎస్‌కూ పడుతది

బలి మేకకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారు