నల్గొండ జిల్లా: వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. తన మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు హృదయ పూర్వకంగా సంఘీభావం తెలియజేస్తున్నానని షర్మిలకు ఫోన్ లో తెలియజేశారు. తాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులమని.. తాము బతికున్నంత కాలం వైఎస్ తమ గుండెల్లో ఉంటాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న మనుషులం అన్నారు.
మా ప్రాంతంలోని ఉదయ సముద్రం 750 కోట్ల ప్రాజెక్ట్ 2014 నాటికి 90% పనుకు పూర్తి అయ్యాయని, కోమటిరెడ్డి సోదరులకు పేరు వస్తుందని కేసీఆర్ ఈ ఏడేళ్లుగా పనులు చేయకుండా అపుతున్నారని ఆరోపించారు. మా జిల్లాలో ఓ డమ్మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడని, ఒక్క రూపాయ నిధులు తేడు, ఊకనే రిబ్బన్ కట్టింగ్ చేస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో పెట్టిన దళితబంధు పథకం తమ నియోజకవర్గంలో కూడా పెట్టాలని రేపు మునుగొడులో పదివేల మందితో కార్యక్రమం చేపడతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.