
ఏటూరునాగారం, వెలుగు: కక్ష సాధింపు, రాజకీయ కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ మంగళవారం ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న అధ్యక్షతన ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చేపట్టిన నిరసన దీక్షకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందనను ఓర్వలేకనే రాహు ల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పారు. హాత్ సే హాత్ యాత్రకు మద్దతుగా ఇంటింటికీ సీతక్క కార్యక్రమంలో భాగంగా మంగపేట మండలంలోని కొత్త చీపురు దుబ్బ, సంఘంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ ఘనపూర్: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రధాని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అందులో భాగమేనన్నారు. స్టేషన్ ఘనపూర్ లోని అంబేద్కర్విగ్రహం వద్ద మంగళవారం ఆమె కాంగ్రెస్శ్రేణులతో కలిసి నిరసన దీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని పదవిని కాపాడుకునేందుకు మోడీ రాహుల్ గాంధీపై కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నర్సంపేటలో సత్యాగ్రహ దీక్ష
నర్సంపేట: ప్రభుత్వ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆరోపించారు. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని రాహుల్గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. మంగళవారం నర్సంపేటలో సత్యాగ్రహదీక్ష చేపట్టారు. దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటులో అదానీ, అంబానీలతో బీజేపీకి ఉన్న బంధాన్ని రాహుల్ బయటపెట్టినందుకు కేంద్రం కక్ష గట్టిందని ఆరోపించారు.